సాయికుమార్ గొంతులో సూపర్ స్టార్….సెట్టవ్వలేదే

సూపర్ స్టార్ రజనీకాంత్ డబ్బింగ్ సినిమాలకు గాయకుడు మనో గొంతుగా ఎంతగా అలవాటు పడ్డామంటే ఆ విషయం తెలియని వాళ్ళు నిజంగానే తలైవర్ తెలుగులో మాట్లాడాడు అనుకునేంత. కానీ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న లాల్ సలామ్ లో డైలాగ్ కింగ్ సాయికుమార్ తో మాటలు చెప్పించడం విని ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఆలస్యంగా వచ్చిన ట్రైలర్ లో చాలా గంభీరంగా వస్తున్న రజని వాయిస్ విని ఏదో తేడాగా అనిపిస్తున్న మాట వాస్తవం. అసలు మనోతో కాకుండా సాయికుమార్ తో ఎందుకు చెప్పించారన్న అనుమానం అభిమానులను వెంటాడుతోంది.

చెప్పుకోవాల్సిన ట్విస్టు మరొకటి ఉంది. ఒకప్పుడు అంటే ముప్పై ఏళ్ళ క్రితం రజనీకాంత్ కు అద్భుతంగా డబ్బింగ్ చెప్పింది సాయి కుమారే. బాషా, పెదరాయుడు, బిర్లా రాముడు, రాజా చిన్న రోజా లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఈయన గొంతు చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా బాషాలో నేనొక్కసారి చెబితే అంటూ బెదిరించే సన్నివేశాన్ని ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. తర్వాత తను పోలీస్ స్టోరీతో హీరో అయిపోవడంతో మనో తెరమీదకు వచ్చాడు. నరసింహతో మొదలుపెట్టి మొన్న జైలర్ దాకా పర్ఫెక్ట్ గా సింక్ కావడం చూసిందే. ఇప్పటి తరానికి ఇదే అలవాటయ్యింది.

ఇప్పుడు హఠాత్తుగా మళ్ళీ సాయికుమార్ తో చెప్పించడం వింతగా అనిపించడం పెద్ద విచిత్రం. లాల్ సలామ్ బిజినెస్ కేవలం రజని ఇమేజ్ మీద జరుగుతోంది. విష్ణు విశాల్ హీరో అయినప్పటికీ సూపర్ స్టార్ పాత్రనే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక సాయికుమార్ మళ్ళీ డబ్బింగులు చెబుతున్నారు. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కు ఎవడైతే నాకేంటితో మొదలుపెట్టి మొన్నటి ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ దాకా గాత్రం ఇచ్చారు కానీ ఒకటి రెండు మినహాయించి అన్నీ ఫ్లాపులే. మరి రజనికి లాల్ సలాం రూపంలో డైలాగ్ కింగ్ ఎలాంటి ఫలితం ఇస్తాడో చూడాలి.