వివాదాస్పద మూవీకి ఓటిటి మోక్షం

ఎంత పెద్ద హీరో అయినా సరే ఏదైనా సినిమా థియేటర్లో రిలీజ్ అయితే కేవలం నెల రోజుల లోపే డిజిటల్ లో 4కె ఒరిజినల్ స్ట్రీమింగ్ తో ఇంటికి రావడం చూస్తున్నాం. సలార్, గుంటూరు కారం ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలున్నాయి. అయితే పది నెలల తర్వాత మోక్షం దక్కని ఒక బ్లాక్ బస్టర్ ఉంది. అదే ది కేరళ స్టోరీ. అదా శర్మ ప్రధాన పాత్ర పోషించిన ఈ కాంట్రావర్సి మూవీ గత ఏడాది మేలో విడుదలై సంచలన విజయం నమోదు చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ ని దాటేసింది. ఇంకా చూడని వాళ్ళు కోట్లలో ఉన్నారు.

ఎప్పుడైనా ఓటిటిలో వస్తుందేమో చూద్దాంలే అనుకున్నవాళ్లకు ఎప్పటికప్పుడు నిరాశనే మిగిలుస్తూ వచ్చింది. చివరికి వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఫిబ్రవరి 16 జీ5లో కేరళ స్టోరీని స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఇంత లేట్ కావడానికి కారణం నిర్మాతలు రేట్ విషయంలో పెట్టిన పేచీనేనని ముంబై టాక్. లేదంటే ఎప్పుడో ఆడియన్స్ చూసేసేవారని అంటున్నారు. దర్శకుడు సుదీప్తో సేన్ భారీ ధర వచ్చేందుకు విశ్వప్రయత్నం చేసినా చివరికి రీజనబుల్ అనిపించే డీల్ తో ఒప్పందం కుదిరిందట. సో ఏదైతేనేం మొత్తానికి మోక్షం దక్కింది.

ది కేరళ స్టోరీ సంగతి సరికాని అఖిల్ ఏజెంట్ కూడా ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. ఇది పోయిన సంవత్సరం ఏప్రిల్ లో రిలీజయ్యింది. డిజాస్టర్ అయినా సరే ఓసారి చూద్దామని వెయిట్ చేస్తున్న బ్యాచ్ పెద్దదే ఉంది. సోనీ లివ్ సంస్థ హక్కులు కొన్నప్పటికీ లీగల్ గా ఏవో ఇష్యూస్ ఉండటంతో కోర్టు కేసు వల్ల నెలల తరబడి నలిగిపోతూనే ఉంది. విక్కీ కౌశల్ జర హట్కె జర బచ్కె, అర్జున్ కపూర్ ది లేడీ కిల్లర్ లాంటివి సైతం థియేటర్ గడప దాటాక, ఓటిటి బాట పట్టలేక నలిగిపోతున్నాయి. లవ్ జిహాద్ ని లక్ష్యంగా చేసుకున్న ది కేరళ స్టోరీకి స్మార్ట్ స్క్రీన్ మీద భారీ రికార్డులు నమోదయ్యే ఛాన్స్ ఉంది.