సీరియస్ వద్దు కామెడీనే ముద్దంటున్న వెంకీ

Hero Venkatesh Slow Down In Accepting Movies
Hero Venkatesh

విక్టరీ వెంకటేష్ కి బాక్సాఫీస్ తత్వం బోధపడింది. తనకు నప్పేలా యాక్షన్ కథలను దర్శకులు చెప్పలేకపోతున్నారని ఇటీవలి సైంధ‌వ్‌ డిజాస్టర్ ఋజువు చేసింది. సరైన కాన్సెప్ట్ తో రావాలే కానీ గణేష్, జయం మనదేరా లాంటి ఊర మాస్ ని మళ్ళీ తెరపైన చూడొచ్చు. కానీ కుదరట్లేదు. అందుకే వెంకీ మామ తిరిగి కామెడీ రూటు పట్టేస్తున్నారు. ఎఫ్2, ఎఫ్ 3 రూపంలో రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో మల్టీ స్టారర్ కాకుండా ఒక సోలో మూవీ చేయబోతున్నట్టు ఇండస్ట్రీ టాక్. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించబోతున్నారు. సైలెంట్ గా దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

భగవంత్ కేసరి విజయం తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో ఓ సినిమా చేస్తారనే న్యూస్ తొలుత వచ్చింది. కానీ మెగాస్టార్ విశ్వంభరతో పాటు హరీష్ శంకర్ కు కమిట్ మెంట్ ఇచ్చారు. సో ఇంకో ఏడాదిన్నర దాకా ఖాళీ లేదు. అంత ఎదురు చూడటం కంటే వెంకీతో ఒక ఎంటర్ టైనర్ తీస్తే హ్యాపీగా ఇంకో హిట్టుని ఖాతాలో వేసుకోవచ్చు. అదే ఆలోచనతో మొదటి నుంచి చివరి దాకా నవ్వించే స్థాయిలో ఒక పాయింట్ రాసుకున్నారట. షూటింగ్ ఎప్పుడు మొదలయ్యేది అధికారిక ప్రకటన వచ్చాక తెలుస్తుంది. అనిల్ తో రాజా ది గ్రేట్ నుంచి దిల్ రాజుకి మంచి బాండింగ్ ఏర్పడిపోయింది.

ఈ కాంబో కన్నా వెంకటేష్ ఫ్యాన్స్ కి కావాల్సింది ఏముంటుంది. సైంధ‌వ్‌ ఫలితం వాళ్ళను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే నారప్పలోనూ వెంకీ ఇంటెన్స్ రోల్ చేశాడు. ఓటిటిలో ఆడింది కానీ థియేటర్లో అయ్యుంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. అందుకే రిస్క్ తగ్గించేసి తన టైమింగ్ ని వాడుకునే అనిల్ రావిపూడి లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదే. రానా నాయుడు సీజన్ 2కి రెడీ అవుతున్న వెంకటేష్ ఇకపై ఏడాదికి ఒక మూవీనే చేయాలని నిర్ణయించుకున్నారట. ప్యాన్ ఇండియా జోలికి వెళ్లకుండా చక్కగా లోకల్ కంటెంట్ కే కట్టుబడతారు.