జూనియర్ ఎన్టీఆర్ కర్రీస్ తెప్పించుకున్నాడట

ఇప్పుడు సోషల్ మీడియా, న్యూస్ ఛానల్స్ లో ఎక్కడ చూసినా కుమారి పేరే మారుమ్రోగిపోతోంది. మొన్న ట్రాఫిక్ కి ఇబ్బందులు వస్తున్నాయనే కారణంగా హైదరాబాద్ పోలీసులు ఆమె వాహనాన్ని అనుమతించకపోవడం పెద్ద దుమారం రేపింది. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చేదాకా వ్యవహారం వెళ్లిందంటే ఇష్యూ ఎంత దూరం చేరుకుందో వేరే చెప్పాలా. ఊరు పేరు భైరవకోన ప్రమోషన్లలో భాగంగా సందీప్ కకిషన్ తన టీమ్ తో సహా అక్కడికి వెళ్లడం, అందరూ మాములు కస్టమర్లలా రాపర్ ప్లేట్లలో అన్నం కూరలు పెట్టించుకున్న వీడియో బాగా వైరల్ అయ్యింది.

ఇంత జరిగాక జనాలు ఊరికే ఉంటారా. మైకులు పట్టుకుని యాంకర్లు ఆవిడతో ఇంటర్వ్యూలకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా కుమారి చెప్పిన మాటలు కొన్ని షాక్ కలిగించేలా ఉన్నాయి. నేరుగా అక్కడికి రాకపోయినా పార్సెల్స్ రూపంలో ఆమె కర్రీస్ తెప్పించుకున్న సినీ ప్రముఖులు ఉన్నారట. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. డ్రైవర్ ని ప్రత్యేకంగా పురమాయించి తెప్పించుకుని రుచి చూశాడట. అయితే నేరుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ లేదు కానీ వంటలకు పేరు పెట్టడానికి ఏముంటుంది. ఆలీ ప్రత్యక్షంగా వచ్చి తీసుకుని వెళ్లారట. ఇలా ఎందరో స్టార్లు వినియోగదారులుగా ఉన్నారట.

ఈ లెక్కన ఏ బోర్డు లేకుండా కుమారి వంటల వ్యాపారం ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. సిఎం వస్తారని తెలిసినప్పటి నుంచి ఈ స్టాల్ కు జనాల తాకిడి ఇంకా ఎక్కువయ్యింది. యూట్యూబర్లు వెల్లువలా వచ్చి పడుతున్నారు. ఒక పక్క మాట్లాడుతూనే ఇంకో పక్క కూరలు వడ్డిస్తూ, ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ ఉన్న కుమారి ఇప్పుడు ట్విట్టర్, ఇన్స్ టా సెలబ్రిటీగా చెప్పుకోవచ్చు. లివర్ కి వెయ్యి రూపాయలు ఎక్స్ ట్రా పేరుతో ఒక మీమర్ సరదాగా సృష్టించిన వీడియో ఇంత రచ్చ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. టెక్నాలజీ మహత్యం అలాగే ఉంటుంది మరి.