జపాన్ దేశంలో సాయిపల్లవి తెరంగేట్రం

బాలీవుడ్ తెరంగేట్రానికి సాయిపల్లవి రెడీ అవుతోంది. స్టార్ హీరో అమీర్ ఖాన్ పెద్దబ్బాయి జునైద్ ఖాన్ రెండో సినిమాలో తనే జోడి అన్న విషయం నెలల క్రితమే బయటికి వచ్చింది. అఫీషియల్ గా చెప్పకపోవడంతో అభిమానుల్లో ఇంకా సందేహమే ఉంది. అయితే అలాంటి డౌట్ ఏమి అక్కర్లేదని ముంబై టాక్. జునైద్ నటించే డెబ్యూ మూవీ సుప్రసిద్ధ యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మించబోయే పీరియాడిక్ డ్రామా. దీనికి మహారాజ్ టైటిల్ ని ఫిక్స్ చేశారు. నిర్మాత ప్లస్ రచయితగా వ్యవహరిస్తున్న ఆదిత్య చోప్రా దర్శకత్వ బాధ్యతను సిద్దార్థ్ పి మల్హోత్రాకు ఇచ్చాడు. మన టాపిక్ రెండో మూవీ గురించి.

ఇటీవలే ముంబైలో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జపాన్ వెళ్ళింది. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం చెల్లి పెళ్లి కోసం ఇండియాలోనే ఉన్న సాయిపల్లవి ఆ తతంగం పూర్తి చేసుకోవడంతో నాగ చైతన్య తండేల్ లో కొద్ది రోజులు పాల్గొని ఆ తర్వాత జపాన్ కు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారాలన్నీ అమీర్ ఖాన్ స్వయంగా చూసుకుంటున్నాడు. తన బ్యానర్ మీదే నిర్మిస్తున్నాడు. దర్శకుడు సునీల్ పాండే. జపాన్ లో ఇప్పటిదాకా ఎవరూ షూట్ చేయని సప్పోరో ప్రాంతంలో అనుమతులు సంపాదించారు.

ఇంత స్పెషల్ గా ఉంది కాబట్టే సాయిపల్లవి ఒప్పుకుని ఉండొచ్చు. ఆమెగా ఇంకా ఈ విషయాలు బయట పెట్టలేదు కాబట్టి వేచి చూడాలి. తన పాత్రకు పెర్ఫార్మన్స్ చేసే స్కోప్ ఉంటే ఒప్పుకోని ఈ ఫిదా పోరి చాలా గ్యాప్ తీసుకుని తండేల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఇండో పాక్ యాక్షన్ థ్రిల్లర్ లో చైతు లుక్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. సాయిపల్లవి పాత్రకు చాలా వెయిటేజ్ ఉంటుందని ముందు నుంచీ వినిపిస్తోంది. ఇవి కాకుండా శివ కార్తికేయన్ తో తమిళంలో ఒక సినిమా చేస్తున్న ఈ హైబ్రిడ్ పిల్ల కొత్త కమిట్ మెంట్లు ఇవ్వలేదు.