స్లమ్ ఏరియాలో నాగ్ ధనుష్ మాఫియా

సాఫ్ట్ అండ్ ఎమోషనల్ కథలను తెరకెక్కిస్తాడని పేరున్న శేఖర్ కమ్ముల పూర్తిగా రూటు మార్చేశారు. ధనుష్ – నాగార్జున కాంబినేషన్ లో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. 90 దశకంలో దేశం మొత్తాన్ని వణికించిన మాఫియా మూలాలు ముంబైలోని ధారవి అనే ప్రాంతంలో ఉన్నాయి. అంతర్జాతీయ పోలీసులను సైతం వణికించిన దావూద్ ఇబ్రహీం చరిత్ర ఇక్కడ మొదలయ్యిందే. ఇప్పటికీ ఆ మురికివాడలో కొన్ని లక్షల మంది ఇరుకు జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

ఈ నేపధ్యాన్ని తీసుకుని శేఖర్ కమ్ముల ఇంటెన్స్ డ్రామాని రూపొందించారట. అయితే ఇదేమి దావూద్ కు సంబంధించిన కథ కాదు. కేవలం అప్పటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని స్వంతంగా అల్లుకున్న కల్పిత కథ. దీని కోసం పరిందా, ధారవి, సత్య, దుకాన్ లాంటి క్లాసిక్స్ మీద ప్రత్యేక రీసెర్చ్ చేశారట. ధనుష్ నాగార్జున పాత్రలకు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా లీక్ కాలేదు. రష్మిక మందన్నకు మరోసారి పెర్ఫార్మన్స్ ఇచ్చే పాత్రే దక్కిందట. హీరోతో ఆడిపాడే రెగ్యులర్ స్టైల్ లో కాకుండా నటనను స్కోప్ ఉండేలా శేఖర్ కమ్ముల శ్రద్ధ తీసుకున్నారని తెలిసింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి ధారావి టైటిల్ నే పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. శేఖర్ కమ్ముల ఇప్పటిదాకా తీసిన చిత్రాల్లో సీరియస్ గా సాగేది ఒక్క అనామిక మాత్రమే. అది కూడా హిందీ మూవీ కహానికి సీన్ టు సీన్ రీమేక్ కావడంతో ప్రత్యేకంగా దాని ఫలితానికి ఈయన్ని బాధ్యత అనలేం. కానీ ఈసారి మాత్రం లవ్ స్టోరీలు, కాలేజీ కుర్రకారు స్టోరీలు కాకుండా గాఢత ఉన్న నేపథ్యం ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ ఏడాది సాధ్యపడకపోతే 2025 సంక్రాంతికి విడుదల చేయాలని నాగార్జున సంకల్పమట.