పవన్ ఫస్ట్ కాల్ షీట్ దానికే..

పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవర్ స్టార్ కాదు.. జనసేనాని మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయన కొన్ని నెలల ముందు సినిమాలు పక్కన పెట్టేశారు. ఆయన కోసం మూడు చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. ఒకవేళ ఏపీలో తెలుగుదేశం-జనసేన కూటమి అధికారంలోకి వచ్చి పవన్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి వర్గంలోకి వచ్చినా.. ఈ సినిమాలు పూర్తి చేయక తప్పదు. కొన్ని నెలలు సినిమాల కోసం కేటాయించి చేతిలో ఉన్న ప్రాజెక్టులు ఫినిష్ చేయాల్సిందే.

పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల షూటింగ్ మధ్య దశలో ఉన్న సంగతి తెలిసిందే. పవన్ మళ్లీ అందుబాటులోకి వచ్చాక వీటిలో దేనికి ప్రయారిటీ ఇస్తారన్నది ఆసక్తికరం.

అనౌన్స్‌మెంట్, షూట్ ఎప్పుడు జరిగాయి అన్న దానికి ప్రకారం వరుస క్రమం చూస్తే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ.. ఇలా ఉంటుంది. కానీ పవన్ మళ్లీ అందుబాటులోకి వచ్చాక ముందు టేకప్ చేసే చిత్రం.. ఓజీనేనట. ఈ మూడు చిత్రాల్లో మేజర్ షూటింగ్ జరిగింది ఓజీనే. దాని చిత్రీకరణ 70 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. నిజానికి బ్రేక్ తీసుకోవడానికి ముందే ఈ సినిమాను పూర్తి చేసేయాలని పవన్ చూశాడు. కానీ కుదరలేదు. మళ్లీ అందుబాటులోకి వచ్చాక కాల్ షీట్లు దీనికే కేటాయిస్తాడట.

జూన్-జులై కల్లా సినిమాను పూర్తి చేసి ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఇది పూర్తయ్యాక ‘ఉస్తాద్..’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలను సమాంతరంగా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎటొచ్చీ ఈ ఏడాది చివరికల్లా అన్ని సినిమాలనూ పూర్తి చేసి సినిమాల నుంచి మళ్లీ బ్రేక్ తీసుకోవాలని పవన్ అనుకుంటున్నాడట.