యాత్ర 2 రాజకీయ లక్ష్యం నెరవేరుతుందా

ఇంకో పది రోజుల్లో యాత్ర 2 విడుదల కాబోతోంది. తమిళ హీరో జీవా ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పాత్ర పోషించగా చిన్న క్యామియోలో స్వర్గీయ వైఎస్ఆర్ గా మమ్ముట్టి కనిపిస్తారు. ఫిబ్రవరి 8 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. అయితే అంచనాల విషయానికి వస్తే ఆశించిన స్థాయిలో బజ్ కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దర్శకుడు మహి వి రాఘవ్ ప్రధానంగా ఓటర్ల ఎమోషన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసినట్టు ట్రైలర్ లో అర్థమైనప్పటికీ అది ఎంత వరకు ఓపెనింగ్స్ కి దోహద పడుతుందనేది కీలకంగా మారనుంది.

ఒకవేళ ఏపీలో రాజకీయ వాతావరణం జగన్ కు పూర్తి అనుకూలంగా ఉంటే యాత్ర 2కి ఓ రేంజ్ లో హైప్ ఉండేది. కానీ జరుగుతున్నది వేరు. తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఇంకో వైపు పవన్ కళ్యాణ్ వచ్చే వారం నుంచి ప్రచార బరిలో దిగబోతున్నాడు. లోకేష్ ప్లాన్స్ వేరుగా ఉన్నాయి. ఇంకోవైపు కాంగ్రెస్ లో చేరిన క్షణం నుంచి షర్మిల అధికార పార్టీని ఎండగట్టడమే పనిగా పెట్టుకుంది. దీంతో సహజంగానే జనంలో అభిప్రాయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. జగన్ భారీ సభలు నిర్వహిస్తూ తనవైపు చెప్పాల్సిందంతా వివరించే పనిలో బిజీగా ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో యాత్ర 2 హిట్ కావడం చాలా కీలకం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం వైసిపి శ్రేణులు ఈ సినిమా రిలీజయ్యాక దీన్ని తమ భుజాలపైకి ఎత్తుకుని మరీ ప్రమోట్ చేస్తారట. దాని కోసం స్పెషల్ షోలు, ఉచిత ప్రదర్శనలు, ఎంఎల్ఏలు మంత్రుల స్పాన్సర్ షిప్ తో ప్రీమియర్లు ఇలా పెద్ద స్ట్రాటజీనే సిద్ధమవుతోందట. ఇంకో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో యాత్ర 2 కంటెంట్ పార్టీ ఇమేజ్ కి ఉపయోగపడాలనేది దర్శక నిర్మాతల లక్ష్యం. వర్మ కూడా వ్యూహంని అలాగే ప్లాన్ చేసుకున్నాడు కానీ కోర్టు బ్రేక్ వేసింది. ప్రస్తుతానికి యాత్ర 2కి అలాంటి చిక్కుముడులు ఏవీ రాలేదు.