నాగార్జున మనసులో సంక్రాంతి ప్లాన్లు

నిన్న జరిగిన నా సామిరంగ సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి మళ్ళీ కలుద్దామంటూ చెప్పడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. అంటే ఏడాది తర్వాత వచ్చే పండక్కు తన సినిమా ఉంటుందనే సంకేతం చాలా స్పష్టంగా ఇచ్చారు. అయితే అది ఏ మూవీ అనేదే సస్పెన్స్ లో ఉంది. ప్రస్తుతం నాగ్ రెండు కమిట్ మెంట్లు అధికారికంగా ఇచ్చారు. మొదటిది ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న పొలిటికల్ కం యాక్షన్ ఎంటర్ టైనర్. రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లానింగ్ లో ఉన్నారు.

రెండోది తమిళ డైరెక్టర్ అనిల్ తో జ్ఞానవేల్ రాజా నిర్మించబోయే భారీ చిత్రం. లవ్ యాక్షన్ రొమాన్స్ టైటిల్ ని పరిశీలనలో పెట్టారు. ఇంకా షూట్ మొదలు కాలేదు. ప్యాన్ ఇండియా రేంజ్ కాబట్టి హడావిడిగా చేయరు. టైం పట్టేలా ఉంది. నాగార్జున చెప్పిన ప్రకారం వీటిలో ఒకటి 2025 సంక్రాంతి బరిలో ఉండొచ్చు. బడ్జెట్ లేదా ఇతర కారణాల వల్ల ఇవి రాలేకపోతే దాని స్థానంలో బంగార్రాజు 3 లేదా నా సామిరంగ 2 తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రెండున్నర నెలల్లో పక్కా ప్లానింగ్ తో ఒక సినిమాని ఎలా పూర్తి చేయొచ్చో దర్శకుడు విజయ్ బిన్నీ చేసి చూపించాడు.

సో ముందు జాగ్రత్తగా కర్చీఫ్ వేయడం వల్ల నా సామిరంగకు వచ్చిన థియేటర్ల సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా నాగార్జున జాగ్రత్త పడటం మంచిదే. అలా అని పోటీ తగ్గుతుందని కాదు. చిరంజీవి విశ్వంభర ముందే లాక్ చేసుకుంది. దిల్ రాజు శతమానం భవతి నెక్స్ట్ పేజీ ప్రకటన వచ్చేసింది. ఒకవేళ ది రాజా డీలక్స్ కనక డిసెంబర్ లో రాకపోతే అప్పుడు జనవరి ఆప్షన్ ని చూసే అవకాశాన్ని కొట్టి పారేయలేం. ఏది ఎలా ఉన్నా ఈసారి కేవలం యాక్షన్ డ్రామాలు చేయకూడదని నాగ్ గట్టిగా డిసైడయ్యారు. ప్రయోగాల వల్ల నిర్మాతలకు నష్టమే కానీ లాభం లేదని గుర్తించేలా నా సామిరంగ ఫలితం దక్కింది.