బాలయ్య కోసం ప్రశాంత్ వర్మ కథలు

సంక్రాంతికి టాప్ వన్ బ్లాక్ బస్టర్ సాధించిన హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పేరు ఇప్పుడు బాలీవుడ్ లోనూ వినిపిస్తోంది. ముందు చిన్న సినిమాగా స్టాంప్ వేయించుకుని అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించడం ఎవరూ ఊహించనిది. ఏకంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసి ప్రస్తుతం ట్రిపుల్ సెంచరీ మీద కన్నేసింది. ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకోవడమంటే మాటలు కాదు. సినిమా ప్రపంచానికి దూరంగా ఉండే ఒక మహా యోగిపుంగవుడి దృష్టిలో పడటం అంటే మాటలు కాదు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పనుల్లో ఉన్నాడు. టైటిల్ పాత్ర పెద్ద స్టార్ హీరో చేస్తారని చెబుతున్నాడు కానీ పేరు ఎవరనేది బయటికి చెప్పడం లేదు. రానా అని ఇన్ సైడ్ టాక్. ఇదిలా ఉండగా బాలకృష్ణతో భవిష్యత్తులో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నట్టు ఈ క్రియేటివ్ డైరెక్టర్ చెప్పడం ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. తన దగ్గర రెండు కథలు ఉన్నాయని, ఒకదాంట్లో సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా వచ్చే సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ ఉంటే, మరొకటి డిఫరెంట్ సెటప్ తో ఒక మంచి కమర్షియల్ సబ్జెక్టు సిద్ధం చేశానని అంటున్నాడు. ఏది కుదిరితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

ఈ కాంబో సెట్ కావడానికి టైం అయితే పడుతుంది. ఎందుకంటే బాబీ దర్శకత్వంలో ఎన్బికె 109 చేస్తున్న బాలయ్య ఎన్నికల సమయంలో బ్రేక్ తీసుకుని తిరిగి వేసవిలో షూటింగ్ కొనసాగిస్తారు. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పూర్తి చేసే ఫ్రీ అయ్యేలోపు ఎంత లేదన్నా ఇంకో ఏడాది పడుతుంది. ఆలోగా బాలకృష్ణ ఇంకో రెండు కమిట్ మెంట్లు పూర్తి చేసే అవకాశం లేకపోలేదు. వాటిలో బోయపాటి శీనుది కూడా ఉంది. ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళతో చేతులు కలిపిస్తే సీనియర్ హీరోల్లోని కొత్త షేడ్స్ బయటికి వస్తాయి. అనిల్ రావిపూడితో బాలయ్య భగవంత్ కేసరి చేయడానికి కారణం ఇదే.