కంగనా డేటింగ్ చేస్తోంది.. కానీ

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఒకప్పుడు చాలా కామ్‌గా ఉండేది. మీడియాతో పెద్దగా మాట్లాడేది కాదు. తన వ్యక్తిగత విషయాల గురించి చర్చే ఉండేది కాదు. తన సినిమాలతోనే వాయిస్ వినిపించేది. ఆమె నటన గురించే అందరూ మాట్లాడుకునేవారు. కానీ కొన్నేళ్లుగా ఆమె సినిమాలేవీ సరిగా ఆడట్లేదు. వరుసబెట్టి డిజాస్టర్లు ఇస్తోంది. దీంతో సినిమాల చర్చ పక్కకు వెళ్లిపోయి.. కంగనా వ్యక్తిగత విషయాలు, ఆమె నోటిదురుసు, రాజకీయ భావజాలం మీద ఎక్కువ చర్చ జరుగుతోంది.

చివరగా కంగనా నుంచి వచ్చిన తేజస్ సినిమా పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే తాజాగా రామమందిర ఆవిష్కరణ సందర్భంగా కంగనా చేసిన హడావుడితో వార్తల్లో వ్యక్తి అయింది.

దీనికి తోడు ఈజ్ మై ట్రిప్ అధినేత నిషాంత్ పిట్టితో కంగనా డేటింగ్‌లో ఉందనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కంగనా స్పందించింది. తాను డేటింగ్‌లో ఉన్న మాట వాస్తవమే అని.. కానీ అది నిషాంత్‌తో కాదని ఆమె స్పష్టం చేసింది.

“దయచేసి అసత్య ప్రచారాలు చేయకండి. ఇది నా విన్నపం. నిషాంత్‌కు పెళ్లయింది. ఆయన వైవాహిక జీవితంగా సంతోషంగా సాగిపోతోంది. నేను వేరే వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నా. అది ఎవరో చెప్పే సరైన సమయం కోసం ఎదురు చూడండి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఫొటో దిగినంత మాత్రాన వారి గురించి ఇలా మట్లాడటం కరెక్ట్ కాదు. మళ్లీ ఇలా ఎప్పుడూ చేయొద్దు” అని కంగనా స్పష్టం చేసింది.