దిల్ రాజు తెలివే తెలివి

Dil Raju V

గత రెండు దశాబ్దాల్లో సినిమాల సంఖ్య, వాటి స్థాయి, విజయాల శాతం.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే టాలీవుడ్ నంబర్ వన్ ప్రొడ్యూసర్ స్థానం దిల్ రాజుకే ఇచ్చేయాలి. ఇప్పుడున్న అగ్ర నిర్మాతల్లో ట్రెండ్‌కు తగ్గ కథల్ని ఎంచుకోవడంలో, వాటిని విజయవంతం చేయడంలో రాజు నైపుణ్యం ఎన్నోసార్లు రుజువైంది. జడ్జిమెంట్ విషయంలో రాజుకు తిరుగులేదనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది.

ఐతే ఎంత పేరున్న, సక్సెస్ ఫుల్ నిర్మాత అయినా సరే.. కొన్నిసార్లు కథల ఎంపికలో పొరబాట్లు చేయొచ్చు. కథ ఎంపికలో తప్పు జరగొచ్చు. లేదంటే ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టొచ్చు. అలా జరిగినపుడు ఫస్ట్ కాపీ చూసుకోగానే ఫలితం అర్థమైపోతుంది. అలాంటపుడు సినిమాను సేల్ చేసి బయటపడటంలో నిర్మాత తెలివేంటన్నది అర్థమవుతుంది. ఈ విషయంలో తనకు తిరుగులేదని దిల్ రాజు రుజువు చేశాడు.

తన నిర్మాణంలో తెరకెక్కిన ‘వి’ సినిమాను దిల్ రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమేజాన్‌కు ప్రైమ్‌‌లో రిలీజ్ చేయడానికి అంగీకరించడం పట్ల ఇండస్ట్రీలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఈ సినిమా స్కేల్ ప్రకారం చూస్తే ఇంకొన్ని నెలలు ఆగి అయినా థియేటర్లలోనే రిలీజ్ చేయాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు.
నిజానికి చిత్ర బృందంలోని వాళ్లూ ఇదే అన్నారు కూడా.

‘వి’ని ఓటీటీలో రిలీజ్ చేయడం ముందు తమకు నచ్చలేదని హీరోలు నాని, సుధీర్‌లతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ స్వయంగా వెల్లడించారు. కానీ రాజు చాలా ముందు నుంచే ‘వి’ని ఓటీటీకి ఇచ్చేయడానికి సుముఖంగా ఉన్నాడు.

నిన్న రాత్రి ప్రైమ్‌లోకి వచ్చిన ‘వి’ని చూసిన ప్రేక్షకులందరూ.. దిల్ రాజు ఈ సినిమాను భలేగా వదిలించేసుకున్నాడని కౌంటర్లు వేస్తున్నారు. ప్రోమోల్లో ఆహా ఓహో అనిపించిన ఈ చిత్రం సినిమాగా తేలిపోయింది. రొటీన్ రివెంజ్ డ్రామాకు ఎక్కడలేని హైప్ ఇచ్చారు. ఈ సినిమా మామూలు రోజుల్లో థియేటర్లలోకి వచ్చినా కచ్చితంగా ఫలితం తేడా కొట్టేదే.

బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావడం చాలా కష్టమయ్యేది. ఇంకొన్ని నెలలు ఆపి.. ఆ తర్వాత అరకొరగా నడిచే థియేటర్లలో ‘వి’ని రిలీజ్ చేస్తే రాజు నష్టాల పాలయ్యేవాడే. ఆ పరిస్థితుల్లో రాజు బాగా ఇబ్బంది పడేవాడు. అలా కాకుండా ఇప్పుడున్న కష్ట కాలంలో అమేజాన్ ప్రైమ్‌కు రూ.32 కోట్లకు సినిమాను అమ్మేసి బయటపడిపోయాడు. అందుకే రాజు తెలివే తెలివి అంటూ సినిమా చూసిన వాళ్లు ఆయన్ని పొగిడేస్తున్నారు.