కామెడీ సినిమాకు సీరియస్ సీక్వెల్

బాలీవుడ్ కామెడీ క్లాసిక్స్ లో ఒకటిగా పేరున్న బడేమియా చోటేమియా 1998లో విడుదలై సంచలన విజయం సాధించింది. అమితాబ్ బచ్చన్, గోవిందాల కాంబినేషన్లో దర్శకుడు డేవిడ్ ధావన్ పూయించిన నవ్వులు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ లో హీరోయిన్లుగా రమ్యకృష్ణ, రవీనాటాండన్ నటించారు. ఇన్నేళ్ల తర్వాత అదే ప్రొడక్షన్ హౌస్ తిరిగి అదే టైటిల్ ని వాడుకుని ఇంకో సినిమా తీశారు. కాకపోతే దర్శకుడు మారిపోయి ఈసారి పూర్తిగా సీరియస్ డ్రామాని తీసుకున్నారు. ఆ జంటే అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్. ఇవాళ టీజర్ వచ్చింది.

సుల్తాన్, టైగర్ జిందా హై లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్షన్ లో కొత్త బడేమియా చోటే మియా రూపొందింది. ఇందులో అక్షయ్, టైగర్ ఇద్దరు సైనికుల పాత్రల్లో కనిపిస్తున్నారు. భారతదేశాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఒక తీవ్రవాది దానికి తగ్గట్టుగానే ఆధునిక సాంకేతిక నైపుణ్యం ఉపయోగించి కుట్రలు పన్నుతాడు. ఇతన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతారు సోల్జర్స్ గా దేశసేవ చేస్తున్న బడేమియా చోటేమియా. బరిలో దిగితే విధ్వంసం తప్ప మరొకటి తెలియని ఈ జంట శత్రుమూకల ఆట ఎలా కట్టించిందనే పాయింట్ మీద రూపొందింది.

ఇది కొనసాగింపు కానప్పటికీ బడేమియా చోటేమియా టైటిల్ తో ఉన్న కనెక్షన్ వల్ల ఆడియన్స్ దీని మీద ప్రత్యేక అంచనాలు పెంచుకున్నారు. గత కొంతకాలంగా హిట్ల కన్నా డిజాస్టర్లు ఎక్కువ ఇస్తున్న అక్షయ్ కుమార్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. వరస రీమేకులతో ఫ్యాన్స్ కి సైతం విసుగొచ్చేలా చేసిన ఈ సీనియర్ హీరోకు పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకోవడం మంచిదే. సోనాక్షి సిన్హా, మానుషీ చిల్లర్ హీరోలకు జోడిగా కనిపించనుండగా రంజాన్ కానుకగా ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నారు. ఈసారి సల్మాన్ ఖాన్ లేకపోవడంతో ఆ స్లాట్ ని మియాలు వాడేసుకుంటున్నారు.