తమిళ స్టార్లను పట్టేస్తున్న తెలుగు నిర్మాతలు

ప్యాన్ ఇండియా పరిధి పెరిగాక అగ్ర నిర్మాతల ప్లాన్లు మారిపోతున్నాయి. ఒక సినిమా తీసి వివిధ భాషల్లో డబ్బింగ్ చేస్తే సరిపోతుందని అనుకోవడం లేదు. పక్క రాష్ట్రాల స్టార్లతో ప్రాజెక్టులు సెట్ చేసుకుని బిజినెస్ రేంజ్ ని పెంచుకునే పనిలో పడ్డారు. గత ఏడాది దిల్ రాజు దీనికి శ్రీకారం చుట్టి విజయ్ వరిసు(వారసుడు) తో రికార్డు స్థాయిలో బిజినెస్ చేసుకున్నారు. కంటెంట్ ఏ రేంజ్ లో మెప్పించిందనేది పక్కన పెడితే హీరో ఇమేజ్ పుణ్యమాని మంచి లాభాలు చూడటమే కాక ఎస్విసి బ్యానర్ కో గుర్తింపు తెచ్చుకున్నారు. గేమ్ ఛేంజర్ వ్యాపారానికి చెన్నైని కేంద్రంగా మార్చబోతున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ ఆల్రెడీ అజిత్ తో ఓకే చేయించుకుంది. అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు కానీ ఒప్పందం జరిగిపోయింది. ఇప్పటిదాకా అజిత్ కెరీర్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు చెన్నై రిపోర్ట్. ఎంతనేది ఏదో ఒక రూపంలో త్వరలోనే బయటికి వస్తుంది. దర్శకుడిగా మార్క్ ఆంటోనీ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దాదాపు లాక్ అయినట్టే. హైదరాబాద్ తరహాలోనే చెన్నైలోనూ మైత్రి ఒక ఆఫీస్ పెట్టేసుకున్నారు. ధనుష్ సార్ తో సితార అడుగు పూర్తయ్యింది. ఈ లిస్టులో డివివి దానయ్య చేరబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్. విజయ్ తో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకుని ఆ మేరకు అడ్వాన్స్ ఇచ్చేందుకు ఒప్పించారట.

డైరెక్టర్ ఇతరత్రా వివరాలు ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం విజయ్ దర్శకుడు వెంకట్ ప్రభుతో గోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బ్రేక్ ఇచ్చి రాజకీయాల్లోకి అడుగు పెడతారనే ప్రచారం ఉత్తిదేనట. అలాంటి ఆలోచన ఏదైనా ఉన్నా ఇంకో రెండు సినిమాలు వేగంగా చేయాలనే ప్లాన్ లో విజయ్ ఉన్నట్టు తెలిసింది. ఆయన ప్రొడ్యూసర్స్ లిస్టు దానయ్యకు చోటు దక్కిందట. ఆర్ఆర్ఆర్, ఓజి లాంటి క్రేజీ సినిమాల నిర్మాతగా అయన అడిగితే కాదంటారా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆల్రెడీ కమెడియన్ సంతానంతో ఒక సినిమా పూర్తి చేసి విడుదలకు రెడీ అయ్యింది. ఈ లిస్టు ఇంకా పెరిగేలా ఉంది.