త్రివిక్రమ్ ప్లానింగ్ గురించి ఇన్ని ప్రచారాలా

గుంటూరు కారం కమర్షియల్ గా ఎంత వసూలు చేసిందనేది పక్కనపెడితే దాన్ని ఇంతదాకా తీసుకురావడానికి ఒకే కారణం మహేష్ బాబేనని అధిక శాతం ప్రేక్షకులు ఒప్పుకుంటున్న వాస్తవం. కంటెంట్ పరంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయిలో లేదనే అసంతృప్తి సగటు జనాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. ఏదో జ్వరం వల్ల ఇంటర్వ్యూ, ప్రెస్ మీట్లకు రాలేకపోయారనే టాక్ వచ్చింది కానీ ప్రస్తుతానికి కోలుకుని ఉంటారు. ఈలోగా త్రివిక్రమ్ గురించి చిత్ర విచిత్రమైన వార్తలు గాసిప్స్ రూపంలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

నిర్మాతగా మారుతున్నాడని, పేరున్న ప్రొడక్షన్ హౌస్ ని భాగస్వామిగా చేసుకుని బయటి దర్శకులతో ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం వాటిలో మొదటిది. రెండోది వెంకటేష్ నాని కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తారనే న్యూస్ వారం క్రితమే షికారు చేసింది. అయితే ఇవేవి నిజం కాదని సన్నిహితుల మాట. గుంటూరు కారం ఫలితం విషయంలో షాక్ తిన్న మాట వాస్తవమే కానీ, మరీ అజ్ఞాతవాసి స్థాయిలో బ్యాడ్ రిజల్ట్ రాలేదు కాబట్టి ఆ కోణంలో హ్యాపీగానే ఉన్నారట. అయితే ఆశించిన రేంజ్ లో అవుట్ ఫుట్ ఇవ్వలేకపోయాననే సోషల్ మీడియా కామెంట్స్ ఆయన దాకా వెళ్లాయి.

త్రివిక్రమ్ నెక్స్ట్ కమిట్ మెంట్ ఉన్నది అల్లు అర్జున్ తో. ఎప్పుడో అఫీషియల్ అయ్యింది. కానీ పుష్ప 2 ది రూల్ పూర్తయ్యాక తక్కువ సమయంలో ఆట్లీతో ఒక సినిమా చేసే ఆలోచనలో బన్నీ ఉన్నట్టు తెలియడంతో అప్పటిదాకా ఖాళీగా ఉండలేడనే యాంగిల్ లో పైన చెప్పిన పాయింట్లు అల్లేశారు. అయితే త్రివిక్రమ్ ఈసారి స్క్రిప్ట్ ని ఆషామాషీగా రెడీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారట. అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి చెక్ పడాలంటే గురూజీ బయటికి రావాలి. మహేష్ జర్మనీ నుంచి తిరిగి వచ్చాక సక్సెస్ మీట్ ఒకటి ఉంటుందట. అక్కడేమైనా చెబుతారేమో.