చిరంజీవి ఆత్మకథకు రచయిత దొరికారు

టాలీవుడ్ సెలబ్రిటీలు ఆత్మకథలు రాసుకోవడం సహజం. అందరూ కాదు కానీ ఎందరో ప్రముఖులు వాళ్లే స్వయంగా లిఖించుకోవడమో లేదా వేరే వాళ్ళతో రాయించుకోవడమో చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, గొల్లపూడి, రామానాయుడు, దాసరి నారాయణరావు, ఎస్విఆర్, విట్టలాచార్య, అల్లు రామలింగయ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి చేరబోతున్నారు. పనుల ఒత్తిడితో తానే రాసుకోలేని పరిస్థితిలో ఈ బృహత్కర బాధ్యతను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ కు అప్పజెబుతున్నట్టు ప్రకటించారు.

ఇవాళ వైజాగ్ లో మాజీ ఎంపి యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ఆధ్వర్యంలో లోకాయుక్త ఫౌండేషన్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన సందర్భంగా చిరంజీవి తన పుస్తకం గురించి చెప్పారు. గతంలో చిరు మీద కొన్ని బుక్స్ వచ్చాయి. రెండేళ్ల క్రితం ప్రముఖ జర్నలిస్టు వినాయకరావు ది లెజెండ్ పేరుతో వెలువరించారు కానీ అది కేవలం నూటా యాభై సినిమాల విశేషాలతో కూడుకుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు యండమూరి రాసే బయోగ్రఫీలో బాల్యం నుంచి ఇప్పటిదాకా అన్ని ఘట్టాలు ఉంటాయి.

ఎంత టైం పడుతుంది, ఎప్పుడనేది చెప్పలేదు కానీ ఫాన్స్ ఒకపక్క సంతోషం వ్యక్తం చేస్తూనే గతంలో రామ్ చరణ్ మీద యండమూరి చేసిన కొన్ని కామెంట్స్ ని గుర్తు చేస్తూ పూర్తి సంతృప్తిని వెలిబుచ్చలేకపోతున్నారు. ఈయనకు చిరంజీవితో అనుబంధం అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం, దొంగమొగుడు లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్లలో ఉంది. స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ కు ఏకంగా డైరెక్షన్ ఛాన్స్ కూడా ఇచ్చారు. కానీ అది అంచనాలు అందుకోలేక ఫెయిలయ్యింది. ఆత్మకథ రాయడమంటే సమయం పట్టే వ్యవహారం కాబట్టి ఎదురు చూసే టైం ఎక్కువే ఉంటుంది.