థియేటర్లు మనసు మార్చుకుంటున్నాయి

ఇవాళ్టితో సంక్రాంతి సినిమాల మొదటి వారం పూర్తయిపోయింది. థియేటర్లకు సంబంధించిన చిక్కులు తొలగిపోతున్నాయి. రిలీజైన సమయంలో సరిపడా స్క్రీన్లు దొరక్క ఇబ్బంది పడ్డ హనుమాన్ కు ఇప్పుడా సమస్య లేదు. ఫస్ట్ వీక్ హైదరాబాద్ లో నాలుగు సింగల్ స్క్రీన్లు ఇస్తే ఇప్పుడా కౌంట్ ఏకంగా పదిహేనుకు చేరుకుంది. గుంటూరు కారం కోసం రిజర్వ్ చేసుకున్నవి కొన్ని ఇటు ఇచ్చేశారు. మల్టీప్లెక్సుల్లో ఉన్న పెద్ద తెరలు క్రమంగా జనాలు దేన్ని ఎక్కువగా కోరుకుంటున్నారో వాటిని వేయడానికే ప్లాన్ చేసుకుంటున్నాయి. ప్రసాద్ పిసిఎక్స్ స్క్రీన్ లో మొన్నటి నుంచే హనుమాన్ కి అయిదారు షోలు ఇస్తున్నారు.

ఉత్తరాంధ్ర, కోస్తా, ఆంధ్రలో నా సామిరంగక షోలు పెంచుతున్నారు. బిసి సెంటర్లలో మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా అక్కడ పెరుగుదల కనిపిస్తోంది. సైంధవ్ మెయిన్ సెంటర్స్ మినహాయించి మిగిలిన చోట్ల బాగా నెమ్మదించింది. డెఫిషిట్లు నమోదు కావడం చూసి ఫ్యాన్స్ కలత చెందుతున్నారు. జరిగిన ప్రమోషన్లకు, వచ్చిన ఫలితానికి పొంతన లేకపోవడంతో నిరాశ తప్పలేదు. శనివారం నుంచి కౌంట్ గణనీయంగా తగ్గనుంది. ఇక గుంటూరు కారం సంగతి చూస్తే బ్లాక్ బస్టర్ అయ్యుంటే లెక్క వేరుగా ఉండేది కానీ డివైడ్ టాక్ తాలూకు ఎఫెక్ట్ బుధవారం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది.

సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే చూసినా రెగ్యులర్ మూవీ గోయర్స్ కు గుంటూరు కారం థర్డ్ ఛాయస్ గా నిలుస్తోంది. హనుమాన్ కు టికెట్లు దొరికే సౌలభ్యం పెరగడంతో పాటు భక్తి జానర్ వద్దనుకున్న వాళ్ళు మహేష్ బాబు, నాగార్జునలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల లిమిటెడ్ రిలీజ్, పరిమిత థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న నా సామిరంగనే ఎక్కువ లాభ పడుతోంది. ఫైనల్ రన్ కి ఇంకా టైం ఉంది కాబట్టి కమర్షియల్ లెక్కలన్నీ తేలాక హనుమాన్ ఫస్ట్ ర్యాంక్ వదిలేసి మిగిలిన మూడు స్థానాల్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారనేది తేలుతుంది. కనీసం ఇంకో పది రోజులు వెయిట్ చేయాలి.