సీక్వెల్స్ వర్షంలో తడవబోతున్న టాలీవుడ్ 

టాలీవుడ్ లో ఎన్నడూ లేనన్ని సీక్వెల్స్ ఈ ఏడాది తెరకెక్కబోతున్నాయి. ఒకప్పుడు పార్ట్ 2 అంటే అదో నెగటివ్ సెంటిమెంట్ లా ఫీలయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడది మారింది. ఒక సినిమా రెండు బిజినెస్సుల సూత్రంతో దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికీ ట్రెండ్ బాహుబలితో మొదలైంది కాదు. వర్మ నిర్మాతగా శివ నాగేశ్వరరావు డైరెక్షన్ లో ‘మనీ’తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్టే కానీ కొనసాగింపు అంచనాలు అందుకోలేదు. దీంతో ఆ తర్వాత ఈ తరహా ప్రయత్నాలు ఎవరూ చేయలేదు. రాజమౌళి సక్సెస్ అయ్యాక కెజిఎఫ్ తో మొదలుపెట్టి అందరూ ఫాలో అవుతున్నారు.

అసలు ఎన్ని ఉన్నాయో ఒక లుక్ వేద్దాం. పుష్ప 2 ది రూల్, టిల్లు స్క్వేర్, డబుల్ ఇస్మార్ట్, సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం, దేవర, గూఢచారి 2, హిట్ 3 ది థర్డ్ కేస్ మొదలైనవి ముందు వరసలో ఉన్నాయి. ఇతర భాషల్లో రూపొందినా తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న వాటిలో అనిమల్ పార్క్, కెజిఎఫ్ 3, బ్రహ్మాస్త్ర 2, భారతీయుడు 2 గురించి చెప్పుకోవచ్చు. డెవిల్, సైంధవ్ లు స్క్రిప్ట్ స్టేజిలో ప్లాన్ చేసుకున్నాయి కానీ ఫైనల్ రిజల్ట్ చూశాక అవి తెరకెక్కడం అనుమానమే. చిరంజీవి విశ్వంభర, పవన్ కళ్యాణ్ ఓజిలు సీక్వెల్ ప్రతిపాదన దశలో ఉన్న మాట వాస్తవం.

ఈ ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా లేదు. కథను ఓకే చేసే దశలోనే స్టార్ హీరోలు పార్ట్ 2కి ఏ మేరకు స్కోప్ ఉంటుందో దర్శక రచయితలతో చర్చిస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ ఒకే భాగంతో సరిపెట్టకపోవచ్చని టాక్. వెయ్యి కోట్ల బడ్జెట్, మహేష్ మూడేళ్ళ విలువైన కాలానికి న్యాయం జరగాలంటే ఇంతకన్నా ఆప్షన్ ఉండకపోవచ్చు. ప్రాజెక్టుని ప్రకటించే రోజు దీనికి సంబంధించిన వివరాలు తెలియబోతున్నారు మన దారిలోనే బాలీవుడ్, కోలీవుడ్ లు ప్రయాణిస్తున్నాయి. అంతటి మణిరత్నమే జక్కన్నని చూసి పొన్నియిన్ సెల్వన్ తీశానని ఒప్పుకున్నా సంగతి తెలిసిందే.