సంక్రాంతి 2024 – విజేతలు ఎవరంటే

టాలీవుడ్ కామధేనువుగా మారిన సంక్రాంతి అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. స్కూళ్ళు, కాలేజీలకు ఇంకో రెండు రోజులు హాలిడేస్ ఉన్నప్పటికీ సగటు మధ్యతరగతి ఉద్యోగ జీవితం మాత్రం ఈ రోజుతో తిరిగి ప్రారంభం. ఈ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా పోటీ పడ్డ నాలుగు సినిమాల్లో విజేత ఎవరో క్లారిటీ వచ్చేసింది. యునానిమస్ గా ప్రేక్షకులు, బయ్యర్లు ఇద్దరూ ‘హనుమాన్’కే ఓటేశారు. పెట్టుబడి – రాబడి లెక్కలు, కంటెంట్ ఇలా రెండు విషయాల్లో విన్నర్ గా నిలబడింది. వారం తిరిగే లోపు వంద కోట్ల గ్రాస్ దాటించేసి ఔరా అనిపించింది.

రెండో స్థానం ‘నా సామిరంగ’కు ఖరారైనట్టే. పండగ రేసులో చివరిగా ఆదివారం వచ్చిన నాగార్జున దొరికిన తక్కువ థియేటర్లలోనూ మాస్ అండతో గట్టెక్కేశారు. రీజనబుల్ రేట్లతో బిజినెస్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు వేగంగా లాభాలు చూసేందుకు ఛాన్స్ దొరికింది. బిసి సెంటర్లు కిష్టయ్యకి అండగా నిలబడ్డాయి. కథా కథనాలు మరీ కొత్తగా లేకపోయినా విలేజ్ డ్రామాని విజయ్ బిన్నీ తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. ఇక ‘గుంటూరు కారం’ అందరి కంటే భారీ కలెక్షన్లు కొల్లగొట్టినా మొదటి రోజు జోరుని ఆపై అంతే స్పీడులో కొనసాగించలేకపోయింది. థియేట్రికల్ బిజినెస్ కొండంత లక్ష్యాన్ని పెట్టింది. మహేష్ బాబు బ్రాండ్ గ్రాస్ ని రెండు వందల కోట్లకు దగ్గరగా తీసుకెళ్తున్నా కానీ రెండో వారం ఎంత బలంగా నిలబడుతుందనేది కీలకం.

వెంకటేష్ 75వ సినిమాగా ప్రమోట్ చేసుకున్న ‘సైంధవ్’ చివరి ప్లేస్ ని తీసుకుని అభిమానులను నిరాశ పరిచింది. దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ అన్ని వర్గాలను మెప్పించలేకపోయింది. ఎమోషన్, యాక్షన్ ఉన్నా ఫ్యామిలీస్, మాస్ కి కావాల్సిన కమర్షియల్ అంశాలు కొరవడటంతో ఫ్లాప్ ముద్ర తప్పించుకోవడం కష్టంగానే ఉంది. ఇంకో వారంపైగానే చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేకపోవడంతో ఈ నాలుగు సినిమాలకు ఇంకో ఛాన్స్ దొరికినట్టు అయ్యింది. ఈ రోజు నుంచి డ్రాప్ గణనీయంగా ఉంటుంది కానీ ఇలాంటి పరిస్థితిలోనూ హనుమాన్ ఆక్యుపెన్సీలు చాలా బలంగా ఉండటం గమనించాల్సిన విషయం.