మెర్రీ క్రిస్మస్ రిపోర్ట్ ఏంటి

టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాల హడావిడిలో పడిపోయాం కానీ ఒక డబ్బింగ్ మూవీ వచ్చిన సంగతే చాలా మంది ప్రేక్షకులకు తెలియలేదు. అదే మెర్రీ క్రిస్మస్. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ జంటగా అందాదున్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఇది రూపొందింది. తెలుగులో అనువదించి మొన్న జనవరి 12నే గుంటూరు కారం, హనుమాన్ లతో పాటు సమాంతరంగా విడుదల చేశారు. థియేటర్లు ఎక్కువ అందుబాటులో లేకపోవడంతో కొన్ని సెంటర్లలో చాలా పరిమిత స్క్రీన్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక వర్గం ఆడియన్స్ లో అంచనాలైతే ఉన్నాయి. ఇంతకీ బొమ్మ రిపోర్ట్ ఏంటో చూద్దాం.

ఏడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చిన ఆల్బర్ట్(విజయ్ సేతుపతి)కి తల్లి చనిపోయిన విషయం తెలుస్తుంది. విసుగ్గా ఉండటంతో ఓ రెస్టారెంట్ కు వెళ్తే మరియా(కత్రినా కైఫ్)కనిపించి ఆమె ఆకర్షణలో పడతాడు. ఫాలో అవుతూ ఇంటికెళ్ళిపోతాడు. దగ్గరయ్యే క్రమంలో మరియా భర్త హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో భయపడిన ఆల్బర్ట్ తన గుర్తులు లేకుండా ఘటనా స్థలం నుంచి మాయమవుతాడు. కొద్దిరోజుల తర్వాత మరియా ఏమి జరగనట్టు కూతురితో పాటు చర్చిలో కనిపిస్తుంది. దీంతో అనుమానం వచ్చిన అల్బర్ట్ ఫాలో చేస్తాడు. ఇక్కడి నుంచి ఊహించని పరిణామాలు తలెత్తుతాయి.

ఫ్రెంచ్ నవల లా మేంటి చార్ట్ ఆధారంగా శ్రీరామ్ రాఘవన్ దీన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ నెరేషన్ చాలా నెమ్మదిగా ఉండటం వల్ల ఈ జానర్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు తప్ప అంత త్వరగా కనెక్ట్ కాలేరు. గంటకు పైగానే సాగతీతగా అనిపిస్తుంది. రిపీట్ సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. అసలు ట్విస్టు మొదలయ్యాక కథనం వేగమందుకుంటుంది. ముఖ్యంగా చివరి అరగంట రాఘవన్ తనదైన స్క్రీన్ ప్లేతో షాక్ ఇస్తారు. ఆర్టిస్టులు తక్కువగా ఉన్నా బాగా నటించారు. కత్రినా ప్లాస్టిక్ ఎక్స్ ప్రెషన్లతో నెట్టుకొచ్చింది. సగం పైగా ల్యాగ్ తో సాగే మెర్రీ క్రిస్మస్ ని ముందే సిద్ధపడితే తప్ప చివరిదాకా కన్నార్పకుండా చూడటం కష్టం.