టికెట్ రేట్లు ప్రభావం చూపిస్తున్నాయి

బడ్జెట్ రికవరీ కోసం అధికంగా పెడుతున్న టికెట్ రేట్లు డివైడ్ టాక్ వచ్చినప్పుడు ఎంత ప్రభావం చూపిస్తాయో గుంటూరు కారం విషయంలో కనిపిస్తోంది. ఉదాహరణకు హైదరాబాద్ మల్టీప్లెక్సులో ఆన్ లైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే గరిష్టంగా 460 రూపాయల దాకా ఖర్చు కావడం సామాన్యులను థియేటర్లకు వచ్చే విషయంలో ఆలోచించేలా ప్రేరేపిస్తోంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితే ఇబ్బంది లేదు. కానీ టాక్ కొంచెం అటుఇటు ఊగినప్పుడు మాత్రం జాగ్రత్త పడాల్సిందే. సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో ఎవరూ గమనించకుండా లేరు.

వీలైనంత త్వరగా టికెట్ ధరలను సాధారణ స్థితికి తేవడం అవసరం. ఎందుకంటే పోటీలో ఉన్న మిగిలిన నాలుగు సినిమాలు హైక్ కోరలేదు. మాగ్జిమం ఉన్న పరిమితి లోపలే ఫిక్స్ చేసుకోవడంతో అది కాస్తా సానుకూలంగా మారుతోంది. హనుమాన్ దూకుడు అందుకే ఆశించిన దానికన్నా ఎక్కువగా ఉంది. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తరహా ప్రభంజనం చూపిస్తోంది. సైంధవ్, నా సామిరంగలు సైతం ఇదే స్ట్రాటజీ ఫాలో కావడంతో ఒక్క గుంటూరు కారమే అన్నింటి కన్నా ఖరీదుగా మారిపోయింది. ఫస్ట్ డే రికార్డులు వచ్చి ఉండొచ్చు కానీ తర్వాత నిలవడం చాలా కీలకం.

అభిమానుల ఫీడ్ బ్యాక్ ని గమనిస్తున్న గుంటూరు కారం బృందం ఇంకా సక్సెస్ మీట్ లాంటి ప్లానింగ్ ఏదీ ప్రకటించలేదు. వసూళ్లకు సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేస్తుంది. పండగ సెలవులు ఉండటంతో ఆక్యుపెన్సీలు బాగున్నాయి కానీ ఒకవేళ నైజామ్ రేట్లు కనక అదుపులోకి వస్తే మరింత మెరుగ్గా వసూళ్లు పెరుగుతాయని బయ్యర్లు అంటున్నారు. ఏపీలో 50 రూపాయల పెంపే కాబట్టి అక్కడ ఇబ్బంది మరీ తీవ్రంగా లేదు. హనుమాన్ పాజిటివ్ టాక్ తో పాటు సైంధవ్, నా సామిరంగల ఫలితాలు వచ్చాక ఏవి చూడాలో డిసైడ్ చేద్దామని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ లక్షల్లో ఉన్నారు.