5 రూపాయల విరాళం వెనుక దూర దృష్టి

నిన్న జరిగిన హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్ మీద 5 రూపాయలు అయోధ్య రామాలయానికి విరాళం ఇస్తామని టీమ్ ప్రకటించింది. తాము చెబితే అంత రీచ్ కాదని భావించి ఏకంగా గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవితో ప్రకటన ఇప్పించారు. దీంతో ఇది సహజంగానే నేషనల్ మీడియాలో ఎక్కువ కవరేజ్ కి నోచుకుంది. జనవరి 22 ప్రారంభం కాబోతున్న రాముడి గుడికి ఇప్పటికిప్పుడు చందాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనం కన్నా దూర దృష్టితో ప్రశాంత్ వర్మ బృందం చేసిన ఆలోచన వెనుక పలు లాభాలు, ఇబ్బందులు రెండూ కనిపిస్తున్నాయి.

రాముడి సెంటిమెంట్ దేశమంతా వీస్తున్న టైంలో ఇలా టికెట్ మీద అయిదు రూపాయలు రాముడికి వెళ్తుందనే మాట భక్తి పరంగా ప్రేక్షకుల మనసుల్లోకి బలంగా వెళ్తుంది. ఆ డబ్బులు ముట్టడం కోసం టికెట్ కొంటారని కాదు కానీ, ఎలాగూ దైవబలం గురించి చెప్పే సినిమా కాబట్టి చూస్తే పోలా అనుకునే ఆడియన్స్ లక్షల నుంచి కోట్లకు చేరుకోవచ్చు. ఇబ్బంది విషయానికి వస్తే ఆదిపురుష్ టైంలో ఒక సీటు హనుమంతుడికి ఖాళీ ఉంచాలని ఊదరగొట్టిన టి సిరీస్ బ్యాచ్ తర్వాత టాక్ వచ్చాక హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. అది పాటించారో లేదో కూడా తెలియనంతగా పట్టించుకోకుండా వదిలేశారు.

ఇప్పుడు హనుమాన్ కి అలా చేయకూడదు. రోజువారీ గ్రాస్ ని చూసుకుంటూ, ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయో ఎప్పటికప్పుడు దాన్ని సమాచార రూపంలో మీడియాకు ప్రేక్షకులకు తెలియజేయడం ద్వారా, ఫైనల్ గా ఎంత మొత్తం అయోధ్యకు వెళ్తుందో క్లారిటీ ఇవ్వడం ద్వారా కామెంట్స్ రాకుండా చూసుకోవచ్చు. గుంటూరు కారంతో క్లాష్ వల్ల ఏపీ, తెలంగాణలో థియేటర్ల కొరత ఎదురుకుంటున్న హనుమాన్ భారమంతా ఉత్తరాది రాష్ట్రాల మీద ఉంది. ఎలాగూ చెప్పుకోదగ్గ బాలీవుడ్ రిలీజ్ లేకపోవడం చాలా ప్లస్ కానుంది. ఒక్క మెర్రి క్రిస్మస్ మాత్రమే రేస్ లో ఉండటం హనుమాన్ కి కలిసొచ్చే పెద్ద అంశం.