ఈవెంట్ మార్పు వెనుక ఏవేవో ప్రచారాలు

విపరీతమైన చర్చలు, కాలయాపనలు, విన్నపాల తర్వాత గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నుంచి గుంటూరుకి తరలిపోయింది. సెలబ్రిటీ ఈవెంట్స్ కి అనుమతులు ఇవ్వడంలో తెలంగాణ పోలీస్ కఠిన వైఖరి అవలంభించడంతో ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టాలీవుడ్ వైఖరి తాము కోరుకున్నంత సానుకూలంగా లేదని, చిరంజీవి నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప మిగిలిన సెలబ్రిటీలు సిఎం రేవంత్ రెడ్డిని కలవలేదనే కోణాన్ని కొందరు వెలికి తీస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేవలం ప్రొడ్యూసర్లు కలిశారు.

ఈ పరిణామాల వెనుక నిజానిజాలు ఎవరూ నిర్ధారించలేరు కానీ ఎట్టకేలకు గుంటూరుకి ఈవెంట్ ని షిఫ్ట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యింది. రేపు నంబూరు క్రాస్ లో ఉన్న పెట్రోల్ బంక్ పక్కన భారీ మైదానంలో ఆఘమేఘాల మీద ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పుడు వేదిక మారడం గుంటూరు వెళ్ళడానికి అనుకూలంగా ఉన్న ఏపీ ఫ్యాన్స్ కి సంతోషంగా ఉంది. తెలంగాణ అభిమానులు అంత దూరం వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ప్రత్యేకంగా స్పెషల్ గెస్టులు ఎవరూ రావడం లేదు కానీ స్టేజి మీద మహేష్ బాబు, శ్రీలీల, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏం మాట్లాడతారనే దాని మీద ఆసక్తి నెలకొంది.

ట్రైలర్ ఎలాగూ వచ్చేసింది కాబట్టి దాని మీద పెద్ద సస్పెన్స్ లేదు కానీ ఈవెంట్ స్పీచుల మీదే అందరి దృష్టి నెలకొంది. కేవలం మూడు రోజుల ముందు చేయాల్సిన ఒత్తిడిలో గుంటూరు కారం టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. ఒకపక్క థియేటర్ల ఇష్యూస్ ని చూసుకుంటూనే ఇంకోవైపు ఫంక్షన్ తాలూకు పనుల్లో నిర్మాత నాగవంశీ తలమునకలై ఉన్నారు. టైటిల్ కి సార్థకత చేకూరుస్తూ ఈవెంట్ ని గుంటూరులోనే చేయడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. హనుమాన్ తో ఒకే రోజు బరిలో దిగుతున్న గుంటూరు కారం అత్యధిక సింగల్ స్క్రీన్లు, మల్టీప్లెక్సుల్లో వేట మొదలుపెట్టబోతున్నాడు.