ఇక్కడ రీమేక్.. అక్కడ సీక్వెల్

బాలీవుడ్లో ఐదేళ్ల కిందట మంచి విజయం సాధించిన థ్రిల్లర్ సినిమా.. రైడ్. అజయ్ దేవగణ్ హీరోగా రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రాన్ని రూపొందించాడు. సౌరభ్ శుక్లా, ఇలియానా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 40 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం.. అప్పట్లో 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్బస్టర్ రేంజ్ అందుకుంది.

ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నారు. రకరకాల కాంబినేషన్లు అనుకోగా ఏదీ వర్కౌట్ కాలేదు. చివరికి ఇటీవలే హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఈ రీమేక్ మొదలైంది. ఈ చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది. ఈ సమయంలో రైడ్ సినిమాకి హిందీలో సీక్వెల్ అనూస్ చేయడం విశేషం.

అజయ్ దేవగణ్ నే హీరోగా రైడ్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నాడు రాజ్ కుమార్ గుప్తా. టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ మరికొందరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. రైడ్ మూవీలో అజయ్ పోషించిన అమేయ్ పట్నాయక్ పాత్రనే ఇందులోనూ కొనసాగబోతున్నట్లు అనౌన్స్మెంట్ పోస్టర్లోనే హింట్ ఇచ్చారు. కాబట్టి ఇది ప్రాపర్ సీక్వెల్ అన్నమాట. ఇందులో సౌరభ్ శుక్లా పాత్ర కూడా కొనసాగబోతోంది. ఇలియానా ఈమధ్య అస్సలు సినిమాలో నటించట్లేదు కాబట్టి ఆమె పాత్ర ఉండకపోవచ్చు. సినిమా ప్రకటిస్తూనే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసింది చిత్ర బృందం.

ఈ ఏడాది నవంబర్ 15న దీపావళి కానుకగా రైడ్-2 విడుదల అవుతుంది. ఈలోపు రైడ్ రీమేక్ తెలుగులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అది వర్క్ అవుట్ అయి.. హిందీలో సీక్వెల్ కూడా క్లిక్ అయితే తెలుగులో దాని రీమేక్ కూడా వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేం.