అరాచకం ఒకవైపు అయోమయం ఇంకో వైపు

ఓవర్సీస్ లో గుంటూరు కారం రికార్డుల వేట మొదలైపోయింది. అయిదు వేలకు పైగా ప్రీమియర్ షోలతో అర మిలియన్ మార్కుకి అతి దగ్గరగా ఉన్న మహేష్ బాబు ఆ లాంఛనాన్ని ఇంకొన్ని గంటల్లో పూర్తి చేస్తాడు. ఇంకా రిలీజ్ కు ఆరు రోజుల సమయం ఉంది కాబట్టి మార్కు ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. జనవరి 12 హైదరాబాద్ తో సహా నైజామ్ లో భారీ రిలీజ్ కు ప్లాన్ చేయడంతో మొదటి రోజే 90 సింగల్ స్క్రీన్లలో అరాచకం సృష్టించబోతున్నాడు. సలార్ టైంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా బుక్ మై షో ఈసారి ముందస్తు జాగ్రత్తగా సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకుని మరీ సిద్ధంగా ఉందని సమాచారం.

ఇలా విధ్వంసం ఒకవైపు కొనసాగుతుండగా ఇంకోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్ తాలూకు అయోమయం తీరడం లేదు. అనుమతులు వచ్చి ఉంటే ఇవాళ సాయంత్రమే యూసఫ్ గూడలో వేడుక జరిగేది. కానీ సెక్యూరిటీ కారణాల దృష్ట్యా పోలీసులు ఇవ్వలేదు. పోనీ రేపు ఆదివారం చేద్దామంటే ఒకే టైంలో సాయంత్రం వైజాగ్ లో సైంధవ్, హైదరాబాద్ లో హనుమాన్ ఈవెంట్లు జరుగుతున్నాయి. వాటితో క్లాష్ కావడం కరెక్ట్ కాదు. అందుకే సోమవారం నుంచి బుధవారం మధ్యలో ఏదో ఒక డేట్ ని లాక్ చేసుకోవాలి. ముహుర్తాలు గట్రా చూసుకోవాలి కాబట్టి అది తేల్చే విషయంలో త్రివిక్రమ్ గట్టి చర్చల్లో ఉన్నారట.

ట్రైలర్ ని రేపు రిలీజ్ చేసే ప్రతిపాదన ఉంది కానీ అది ఈవెంట్ లో చేస్తేనే కిక్ ఉంటుందన్న అభిప్రాయంలో నిర్మాత నాగవంశీ ఉన్నందు వల్ల ఏ ప్రకటన వెంటనే ఇవ్వలేకపోతున్నారు. ఒకవేళ కన్ఫర్మ్ చేసుకుంటే అప్పటికప్పుడు వదిలేందుకు పోస్టర్లను సిద్ధంగా ఉంచుకున్నారు. ప్రస్తుతం ఈవెంట్ అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీక్ డేస్ అయినా పర్వాలేదనుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఏపీ తెలంగాణకు సంబంధించి గుంటూరు కారం అడ్వాన్స్ బుకింగ్స్ ని జనవరి 9 సాయంత్రం నుంచి మొదలు కావొచ్చు. మహేష్ మేనియా మాత్రం మాములుగా లేదు.