నైజాం కింగ్ ప్రభాస్

సలార్ సినిమా మీద నైజాం ఏరియాకు ఏకంగా 65 కోట్ల పెట్టుబడి పెట్టేసింది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు డిజాస్టర్లు, పైగా సలార్ ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో 65 కోట్ల షేర్ రాబట్టడం అంటే ఆషామాషీ విశయం కాదని అన్నారు ట్రేడ్ పండిట్లు. ఈ నేపథ్యంలో సలార్ కు టాక్ కూడా మిక్స్డ్ గా రావడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యం అన్న చర్చ జరిగింది.

కానీ సలార్ ఆ అంచనాలను తలకిందులు చేసింది. బ్రేక్ ఈవెన్ కావడమే కాదు 10 కోట్ల మేర లాభాలు అందించి ఔరా అనిపించింది. డివైడ్ టాక్ తోనే ఈ సినిమా నైజాంలో వసూళ్ల మోత మోగిస్తూ సాగిపోయింది. ఇప్పటికే సలార్ నైజాంలో 120 కోట్ల మేర గ్రాస్, 75 కోట్లకు పైగా షేర్ రాబట్టి బాహుబలి తర్వాత ఈ ఏరియాలో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

సలార్ ప్రభంజనం చూశాక నైజాం కింగ్ ట్యాగ్ ప్రభాస్ కు ఇచ్చేయాల్సిందే అనిపిస్తోంది. బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎవ్వరు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఒక్కో సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వరుసగా మూడు డిజాస్టర్లు ఎదురైనప్పటికీ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఇంకా చెక్కుచెదరలేదని సలార్ సినిమా రుజువు చేసింది.

నైజాంలో డిస్ట్రిబ్యూటర్ కోరుకున్న అదనపు రేట్లు, షోలు దక్కడం, రిలీజ్ ప్లాన్ పక్కాగా ఉండటం వల్ల బాక్సాఫీస్ దగ్గర సలార్ అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా వసూళ్లు 700 కోట్ల మైలురాయికి చేరువగా ఉన్నాయి.