రాజకీయ ‘యాత్ర’లో మలుపుల చదరంగం

2019 ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని నేపధ్యంగా తీసుకుని చేసిన యాత్ర బాగానే ఆదరణ దక్కించుకుంది. దర్శకుడు మహి వి రాఘవ్ పొలిటికల్ అజెండాతో రూపొందించినా అందులో ఎమోషన్ కనెక్ట్ అవ్వడంతో పాస్ అయ్యింది. సరిగ్గా అయిదేళ్లకు మళ్ళీ ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథను చెప్పేందుకు పూనుకున్నారు. అదే యాత్ర 2. తమిళ నటుడు రంగం ఫేమ్ జీవా ప్రధాన పాత్ర పోషిస్తుండగా మమ్ముట్టి, మహేష్ మంజ్రేకర్ మినహాయించి దాదాపు అందరూ కొత్తవాళ్లే కనిపిస్తున్నారు.

రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన పని చేసిన పార్టీ జగన్(జీవా)ని నయానో భయానో లొంగదీసుకోవాలని చూస్తుంది. కానీ సాధ్యం కాకపోవడంతో జైలుకు పంపి అణిచేందుకు సిద్ధ పడుతుంది. దీనికి ప్రతిపక్ష నాయకుడు(మహేష్ మంజ్రేకర్) తోడవ్వడంతో జగన్ లక్ష కోట్ల స్కాము మీద కటకటాల పాలవుతాడు. అయినా సరే తన తండ్రికి ఇచ్చిన మాట కోసం, జనం సంక్షేమం కోసం బెయిలు మీద బయటికి వచ్చాక పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలుసుకుంటాడు. ఈ క్రమంలో ఒడిదుడుకులను ఎలా దాటుకున్నాడు, అధికార పీఠం దాకా ఎలా చేరుకున్నాడనేది అసలు కథ.

అపోజిషన్ లీడర్ల పేర్లను నేరుగా ప్రస్తావించకపోయినా స్పష్టంగా జగన్, రాజశేఖర్ రెడ్డిల బయోపిక్ గా చూపించడం వల్ల చాలా సులభంగా పాత్రధారులను గుర్తించేలా చేశారు. జగన్ రాజకీయ ప్రస్థానాన్ని ఎలివేట్ చేయడానికి మహి వి రాఘవ్ మళ్ళీ భావోద్వేగాల మార్గాన్నే ఎంచుకున్నాడు. తెలుగు బాషా గ్రామర్ ప్రకారం చెప్పాలంటే వర్మ వ్యూహం వికృతి అయితే మహి యాత్ర 2 ప్రకృతి. అంతే తేడా. చెప్పాలనుకున్న విషయం ఒకటే అయినా ఎంచుకున్న పంథా, లక్ష్యాలు వేరు. ఫిబ్రవరి 8 విడుదల కాబోతున్న యాత్ర 2కి మాదీ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.