ఆ ప్రాజెక్టు నుంచి ప్రవీణ్ సత్తారు ఔట్

‘గరుడవేగ’ సినిమా రిలీజై మూడేళ్లు కావస్తోంది. ఆ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రవీణ్ సత్తారు.. ఇప్పటిదాకా తన తర్వాతి సినిమాను మొదలుపెట్టలేకపోయాడు. రామ్‌తో అనుకున్న ఓ సినిమా బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది. మిగతా సమయాన్నంతా ‘గోపీచంద్ బయోపిక్’ తినేసింది.

ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత కథతో సినిమా చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టి.. హీరోగా సుధీర్ బాబును, దర్శకుడిగా ప్రవీణ్ సత్తారును ఎంచుకుంది. ఈ చిత్రానికి స్క్రిప్టు బాధ్యత అంతా నిర్మాణ సంస్థే తీసుకుంది.

వాళ్లు పెట్టుకున్న రచయితలు అవసరమైన పరిశోధన అంతా జరిపి స్క్రిప్టు రెడీ చేశాక ప్రవీణ్‌ను దర్శకుడిగా తీసుకోవాలనుకున్నారు. అతను కూడా ఓకే చెప్పాడు. కానీ కారణాలేంటో కానీ.. రెండేళ్ల కిందటే మొదలు కావాల్సిన సినిమా ఎంతకీ పట్టాలెక్కలేదు.

దీని కోసం ఇటు సుధీర్, అటు ప్రవీణ్ చాలా సమయం పెట్టారు. చివరికి సుధీర్ ఎంతో కాలం ఎదురు చూడలేక వేరే ప్రాజెక్టుల వైపు వెళ్లిపోయాడు. కానీ ఈ ప్రాజెక్టు నుంచి అతను తప్పుకోలేదని.. ఎప్పుడు మొదలైనా గోపీచంద్ పాత్రను తనే చేస్తాడని అంటున్నారు.

సుధీర్ స్వతహాగా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడం, గోపీ అతడికి మిత్రుడే కావడం, ‘బాగీ’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకూ పరిచయం ఉండటంతో ఈ పాత్ర చేయడానికి అతడి కంటే మంచి ఛాయిస్ కనిపించేలా లేదు. కానీ ఈ చిత్రానికి దర్శకుడిగా మాత్రం ప్రవీణ్ సత్తారు ఉండబోవట్లేదన్నది తాజా సమాచారం. ఇటీవలే అక్కినేని నాగార్జునతో ప్రవీణ్ సినిమా ఖరారైంది.

అది పూర్తి చేశాక గోపీచంద్ బయోపిక్ మీదికి వెళ్తాడేమో అనుకున్నారు కానీ.. ఈ ఏడాది డిసెంబర్లోనే ఈ చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుధీర్ వెల్లడించాడు. అదే సమయానికి ప్రవీణ్.. నాగ్ సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. దీన్ని బట్టి అతను గోపీచంద్ బయోపిక్‌ను వదిలేశాడని అర్థమవుతోంది.

ఐతే ఇలా ఇదిగో అదిగో అనుకుంటూనే గోపీచంద్ బయోపిక్ వెనక్కి వెళ్తూనే ఉంది. సుధీర్ అన్నట్లు డిసెంబర్లోనే అయినా నిజంగా ఈ చిత్రం పట్టాలెక్కుతుందా అన్నది చూడాలి. ఇంతకీ ప్రవీణ్ స్థానంలోకి రాబోయే దర్శకుడెవరో మరి?