శేఖర్ కమ్ముల గేమ్ ప్లాన్ మారుతోంది

హంగులు, ఆర్భాటాలు, భారీ బడ్జెట్ లు వీటికి దర్శకుడు శేఖర్ కమ్ముల దూరంగా ఉంటారు. సింపుల్ కథలను తీసుకుని, వాటిని తనదైన శైలిలో ఎమోషన్లు జోడించి, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మీదే కంటెంట్ ఆడాలని చూసే టైపు. అందుకే లవ్ స్టోరీ, ఫిదాలో మనకు నాగ చైతన్య, వరుణ్ తేజ్ కన్నా సగటు మధ్యతరగతి యువకులే కనిపిస్తారు. అయితే ఇప్పుడు తన కొత్త సినిమాకు మాత్రం క్యాస్టింగ్ ప్లస్ టెక్నికల్ సపోర్ట్ రెండు విషయాల్లోనూ స్టార్ కలరింగ్ జోడిస్తున్నారు. ధనుష్ – నాగార్జున కలయికలో మల్టీ స్టారర్ కావడంతో దీని రేంజ్ ఒక్కసారిగా ప్యాన్ ఇండియాని చేరుకుంది.

మాములుగా శేఖర్ కమ్ముల ఫామ్ లో ఉన్న సంగీత దర్శకులను తీసుకోరు. ఆనంద్ కి కెఎం రాధాకృష్ణని పరిచయం చేశారు. దీంతో పాటు గోదావరికి అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. హ్యాపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి మిక్కీ జె మేజర్ నుంచి మంచి మ్యూజిక్ రాబట్టుకున్నారు. రీమేక్ కావడంతో ఒక్క అనామికకు మాత్రం కీరవాణితో చేయించుకున్నారు. ఫిదా, లవ్ స్టోరీకి పని చేసిన శక్తికాంత్ కార్తీక్, పవన్ సిహెచ్ డిమాండ్ ఉన్న వాళ్ళు కాదు. అయినా హిట్లు పడ్డాయి. కానీ ధనుష్ మూవీకి మాత్రం రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకునే ప్రతిపాదన బలంగా ఉందని తెలిసింది.

దీనికి కారణాలున్నాయి. ధనుష్ మూవీ బహు భాషల్లో వెళ్తుంది కాబట్టి దాని సంగీతం మీద సహజంగానే అంచనాలు ఎక్కువగా ఉంటయి. పైగా మ్యూజిక్ ని కొనే విషయంలో ఆడియో కంపెనీలు బ్రాండ్లకు ప్రాధాన్యం ఇస్తాయి కనక దేవి అంటే రేట్ ఎక్కువ పలుకుతుంది. తమిళంలోనూ గుర్తింపు ఉన్న కారణంగా ఆడియన్స్ త్వరగా రిసీవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. పుష్ప, వాల్తేరు వీరయ్యలతో ఫామ్ లోకి వచ్చిన దేవిని లాక్ చేసేది లేనిది ఇంకొద్ది రోజుల్లో తెలియనుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామా చూపించబోతున్న శేఖర్ కమ్ముల ఈసారి కమర్షియల్ ఫ్లేవర్ ని బలంగా టచ్ చేయబోతున్నట్టు వినికిడి.