సలార్ 2 కోసం రెండేళ్లు ఆగాల్సిందే

షారుఖ్ ఖాన్ డంకీని మైళ్ళ దూరంలో వెనక్కు నెట్టేసి క్రిస్మస్ విజేతగా నిలిచిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఇంకా బాక్సాఫీస్ వద్ద స్టడీగానే ఉంది. యూనిట్ అఫీషియల్ గా వదిలిన పోస్టర్ల ప్రకారం ఆరు వందల కోట్ల గ్రాస్ దాటేసింది కానీ ట్రేడ్ మాత్రం దానికన్నా తక్కువే వచ్చిందని ఆఫ్ ది రికార్డ్ అంటోంది. నిజానిజాల సంగతి పక్కనపెడితే సలార్ 2 శౌర్యంగ పర్వంకి కావాల్సిన బజ్ అయితే సృష్టించి పెట్టడంలో సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అభిమానుల చూపు సీక్వెల్ మీద ఉంది. నిర్మాత విజయ్ కిరగందూర్ దీని గురించి చాలా స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు.

ఆయనే స్వయంగా చెప్పిన దాని ప్రకారం సలార్ 2 షూటింగ్ ఈ ఏడాది మొదలవుతుంది కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. తమకు సెంటిమెంట్ గా కలిసి వస్తున్న నెలనే టార్గెట్ గా పెట్టుకుని 2025 డిసెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటారట. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్యాన్ ఇండియా మూవీని ఈ ఏడాదే మొదలుపెట్టాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ వేసవి నుంచి షెడ్యూల్స్ వేయడానికి సిద్ధంగా ఉంది. అయితే స్క్రిప్ట్ లాక్ అయ్యిందా లేదనేది మాత్రం ఇంకా గుట్టుగానే ఉంది.

సలార్ 2 స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. మొదటి భాగాన్ని మించిన ఎలివేషన్లు, డ్రామా, రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇందులో ఉంటాయని విజయ్ ఊరిస్తున్నారు. సీజ్ ఫైర్ కేవలం పాత్రలను పరిచయం చేసిన ట్రైలరని, అసలు కథని శౌర్యంగ పర్వంలో చూస్తారని అంటున్నారు. ప్రభాస్ కల్కి, మారుతీ సినిమాలు పూర్తి చేశాక కానీ సలార్ 2లో చేరలేడు. ఇది అయ్యాక సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ప్రపంచంలో అడుగుపెట్టాలి. హను రాఘవపూడి కూడా సమాంతరంగా చేస్తారనే టాక్ ఉంది కానీ ఇంకో రెండు మూడు నెలలు ఆగితే కానీ అధికారికంగా స్పష్టత వచ్చేలా లేదు.