ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి కనిపిస్తే

ఇంకో తొమ్మిది రోజుల్లో విడుదల కాబోతున్న గుంటూరు కారం తాలూకు అప్డేట్ ఏదైనా సరే అభిమానులకు విపరీతమైన ఎగ్జైట్ మెంట్ ఇస్తోంది. నిన్న సాయంత్రం ఫ్యాన్స్ పెట్టుకున్న ట్విట్టర్ స్పేస్ లో నిర్మాత నాగవంశీ ఇచ్చిన స్పెషల్ న్యూస్ వాళ్ళ ఉత్సహాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. దాని ప్రకారం సెకండ్ హాఫ్ లో ఇద్దరు సూపర్ స్టార్లు ఒకేసారి తెరమీద కనిపించబోతున్నారు. అంటే మహేష్ బాబుతో పాటు కృష్ణగారిని చూడొచ్చన్న మాట. అదేంటి నటశేఖర కాలం చేశారు కదా ఎలా సాధ్యమని అనుకోకండి. మనం గతంలో చూసిన టెక్నాలజీనే మరింత స్పెషల్ గా వాడబోతున్నట్టు తెలిసింది.

కలిసుందాం రా, యమదొంగ సినిమాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ ని స్పెషల్ ఎఫెక్ట్స్ ద్వారా చూపించడమే కాదు ఏకంగా డ్యాన్సులు కూడా చేయించారు. ఇందులో కూడా అలాంటిది ఉంటుందని యూనిట్ టాక్. అయితే వాటికి భిన్నంగా కథతో త్రివిక్రమ్ దీన్ని ముడిపెట్టిన విధానం కొత్తగా ఉంటుందని చెబుతున్నారు. మహేష్ సినిమాలకు అడ్డాగా చెప్పుకునే సుదర్శన్ 35 ఎంఎం కూడా ఒక పాత్రగా వస్తుందట. మరి గుంటూరులో మిర్చి వ్యాపారం చేసుకునే వెంకటరమణారెడ్డికి హైదరాబాద్ కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలియాలంటే జనవరి 12 దాకా ఆగి తెరమీద చూడాల్సిందే.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆరో తేదీ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో చేయబోతున్నట్టు తెలిసింది. పాసులను సిద్ధం చేసేశారు. అతిథిగా టీమ్ తప్ప ఎవరూ రాకపోవచ్చని తెలిసింది. మాములుగా త్రివిక్రమ్ సినిమాలకు స్పెషల్ గెస్టులు ఎవరూ ఉండరు. హీరోనే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాడు. ఈసారి కూడా అదే జరగనుంది. టైం తక్కువగా ఉండటంతో థియేటర్ల కేటాయింపు, బిజినెస్ వ్యవహారాలు, వేడుక తాలూకు ఏర్పాట్లతో టీమ్ బిజీగా ఉంది. కొన్నేళ్ల మాస్ కరువు దీంతో పూర్తిగా తీరుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో బలంగా ఉంది.