సామిరంగను గట్టెక్కించిన బిగ్ బాస్

సంక్రాంతి సినిమాల్లో చివరిగా వస్తున్నది నా సామిరంగ. జనవరి 14 విడుదలని లాక్ చేసుకున్న టీమ్ దానికి తగ్గట్టే ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. ఓటిటి, డిజిటల్ డీల్ జరగక ముందే డేట్ అనౌన్స్ చేశారనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా జరిగింది. అయితే నాగార్జున స్టార్ మా ఛానల్ తో తనకున్న బాండింగ్, పలుకుబడి ఉపయోగించి నాన్ థియేట్రికల్ డీల్స్ ని క్లోజ్ చేయించినట్టు సమాచారం. హిందీ డబ్బింగ్ మినహాయించి సుమారు ముప్పై కోట్లకు పైగా ప్రొడ్యూసర్ కు వర్కౌట్ అయ్యేలా డీల్ సెట్ చేశారని తెలిసింది. ఇదంతా అఫీషియల్ గా చెప్పేది కాదు కాబట్టి వ్యవహారమంతా గుట్టే.

దీంతో ఒక పెద్ద టెన్షన్ నా సామిరంగకు తీరిపోయింది. ఇక ఇప్పుడు థియేటర్ల మీద దృష్టి పెట్టాలి. అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అధిక శాతం ఏరియాలకు పంపిణి చేసే బాధ్యతను నాగ్ స్వయంగా తీసుకున్నారు. తనతో రెగ్యులర్ గా బిజినెస్ చేసే పంపిణీదారులతో మాట్లాడి వీలైనన్ని స్క్రీన్లు దక్కేలా ముంతనాలు జరుపుతున్నారని వినికిడి. గుంటూరు కారం అప్పటికి మూడో రోజులోకి ప్రవేశించి ఉంటుంది కాబట్టి మొదటి రోజు తనకు ప్రయోజనం దక్కేలా అదనపు షోల కోసం మాట్లాడుతున్నారట. సోలోగా వచ్చి ఉంటే కథ వేరుగా ఉండేది కానీ ఇప్పుడది సాధ్యపడటం లేదు.

గత కొన్నేళ్లలో ఏ నాగార్జున సినిమాకు రానంత బజ్ నా సామిరంగకు కనిపిస్తోంది. పండగ సెంటిమెంట్ మీద పట్టుదలగా ఉన్న కింగ్ ఈసారి బ్లాక్ బస్టర్ ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు. నిర్మాత తాను కానప్పటికీ  అన్నీ దగ్గరుండి చూసుకోవడాన్ని బట్టి ఎంత ప్లానింగ్ తో ఉన్నారో అర్థమవుతోంది. బిగ్ బాస్ ని దిగ్విజయంగా నడిపిస్తున్న నాగార్జునతో ఉన్న అనుబంధం వల్లే స్టార్ మా మేనేజ్ మెంట్ నా సామిరంగకు మంచి ఆఫర్ ఇచ్చారట. హీరోయిన్ ఆశికా రంగనాథ్, అల్లరి నరేష్,  రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తుండగా ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.