డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు

వాతావరణం చూస్తుంటే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టక తప్పేలా లేదని ఇండస్ట్రీ టాక్. స్ట్రెయిట్ చిత్రాలకే సరిపడా స్క్రీన్లు లేక డిస్ట్రిబ్యూటర్లు కిందా మీద పడుతున్న తరుణంలో కొత్తగా కెప్టెన్ మిల్లర్, అయలన్ లను నెత్తి మీద పెడితే భరించలేమని బయ్యర్లు తెగేసి చెబుతున్నారట. దీని వల్ల ఈ రెండు ప్యాన్ ఇండియా మూవీస్ కి టాలీవుడ్ రిలీజ్ ఆలస్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓ వారం గ్యాప్ తర్వాత వెసులుబాటు వచ్చేలా చూస్తామని అంటున్నారు. ఫిలిం ఛాంబర్ ఈ విషయంగా చొరవ తీసుకోలేదు కానీ పరిస్థితులే వీటికి దారి తీస్తున్నాయి.

ఒకవేళ ఇది జరిగితే మాత్రం మొదటిసారి కీలకమైన సీజన్ లో తమిళ సినిమాలను నిలువరించిన ఘనత దక్కుతుంది. ఇక్కడ ట్విస్టు ఏంటంటే గుంటూరు కారం, హనుమాన్ లు వస్తున్న జనవరి 12నే కెప్టెన్ మిల్లర్, అయలన్ లను షెడ్యూల్ చేశారు. ఒకటే రోజు నాలుగు రిలీజులంటే వాటిని అకామడేట్ చేయడం కష్టం. ఇప్పటికీ ప్రశాంత్ వర్మ తమకు బెదిరింపులు వస్తున్నాయని, సెన్సార్ కు అడ్డు పడుతున్నారని సంచలన ఆరోపణలు చేసి కొత్త చర్చని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ధనుష్, శివ కార్తికేయన్ ఇలా పక్క హీరోలకు ఎవరు మద్దతు ఇచ్చినా అది నైతికత కాదు.

కథ ఇక్కడితో అయిపోలేదు. విజయ్ సేతుపతి-కత్రినా కైఫ్ ల హిందీ అనువాదం మెర్రి క్రిస్మస్ సైతం జనవరి 12నే వస్తోంది. దీనికి దక్షిణాది రాష్ట్రాల్లో థియేటర్లు  దొరక్కపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే బాలీవుడ్ మార్కెట్ ని మాత్రమే ఎక్కువ టార్గెట్ చేసుకుంది కాబట్టి నష్టపోయేది ఉండదు. మహా అయితే ఏపీ తెలంగాణ మల్టీప్లెక్సుల్లో సింగల్ డిజిట్ షోలు తప్ప ఇంకేమి దొరకదు. గుంటూరు కారం, సైంధవ్‌, ఈగల్, హనుమాన్, నా సామిరంగలకు సరిపడా షోలు ప్లాన్ చేయడానికే తలప్రాణం తోకకొస్తున్న నేపథ్యంలో పక్క భాషలకు నో ఎంట్రీ బోర్డు పెట్టడం ఖచ్చితంగా అవసరమే.