డెవిల్ వివాదం.. నిర్మాత స్పందించాడు

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం డెవిల్ ఇంకొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 1940 దశకంలో బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించారు. డెవిల్ టీజర్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా అనిపించడంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ‘డెవిల్’ రైటింగ్, డైరెక్షన్ క్రెడిట్ విషయంలో కొన్ని నెలలుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మొదలైనపుడేమో దర్శకుడిగా నవీన్ మేడారం పేరుంది. కానీ టీజర్ లాంచ్ అయినపుడు డైరెక్టెడ్ బై ‘అభిషేక్ నామా పిక్చర్స్ టీం’ అని వేశారు. కానీ సినిమా రిలీజ్ సమయానికేమో నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడైపోయాడు. తనను దర్శకుడిగా తప్పించడంపై నవీన్ ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాడు కానీ.. రిలీజ్ టైం కి అతను మౌనం వీడాడు.

డెవిల్ సినిమాకు తనే దర్శకుడినని, స్క్రిప్ట్ దశ నుంచి అన్ని తానై వ్యవహరించానని.. 105 రోజుల పాటు ఈ సినిమాను వివిధ లొకేషన్లలో చిత్రీకరించానని ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు నవీన్ మేడారం. కొందరి ఇగో వల్ల తాను దర్శకుడి స్థానం నుంచి వైదొలగాల్సి వచ్చిందంటూ పరోక్షంగా అభిషేక్ నామాపై అతను విమర్శలు గుప్పించాడు. మరి నవీన్ పోస్ట్ విషయంలో అభిషేక్ నామా ఎలా స్పందిస్తాడో అని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు అభిషేక్ లైన్లోకి వచ్చాడు.

డెవిల్ సినిమాకు సంబంధించి బేసిక్ స్టోరీ లైన్ తనదేనని అతను చెప్పాడు. ఆ లైన్ ఆధారంగా శ్రీకాంత్ విస్సా స్క్రిప్టు రెడీ చేశాడని.. అతడి నరేషన్ విని కళ్యాణ్ రామ్ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని.. ఆ తర్వాత తన బ్యానర్లో బాబు బాగా బిజీ సినిమా చేసిన నవీన్ మేడారంను దర్శకుడిగా ఎంచుకున్నట్లు అభిషేక్ వెల్లడించాడు. అయితే సినిమా మొదలయ్యాక రెండో రోజుకే అతను ఇంత పెద్ద ప్రాజెక్టును హ్యాండిల్ చేయలేడనీ అర్థమైందని.. దీంతో తనే ఛార్జ్ తీసుకున్నానని.. టెక్నీషియన్ల సహకారంతో సినిమా పూర్తి చేశానని అభిషేక్ తెలిపాడు. నవీన్ సినిమా సరిగా తీయట్లేదు అని తాను చెప్పిన అతను వినకుండా.. కొంతకాలం టీంతో కంటిన్యూ అయ్యాడని.. కానీ సినిమా తీసింది మాత్రం తనేనని.. అందుకే దర్శకుడిగా క్రెడిట్ తీసుకున్నానని అభిషేక్ స్పష్టం చేశాడు. తన డబ్బుతో తనే సినిమా తీసుకుని దర్శకుడిగా క్రెడిట్ తీసుకుంటే అభ్యంతరం ఏమిటని అతని ప్రశ్నించాడు.