వెంకటేష్ నోట హిమాలయాల మాట

నిన్న హైదరాబాద్ జెఆర్సిలో జరిగిన వెంకీ 75 ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఇప్పటిదాకా విక్టరీ వెంకటేష్ తో పని చేసిన దర్శకులు, సహనటులు, సాంకేతిక నిపుణులను ఒక చోట చేర్చి అభిమానులకు చిరకాల జ్ఞాపకాలను ఇవ్వాలనుకున్న సైంధ‌వ్‌ నిర్మాతలు దానికి తగ్గట్టే మంచి ప్లానింగ్ తో నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా వెంకీ మాట్లాడుతూ ఒకవేళ తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత చిరు కనక ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టకపోయి ఉంటే తాను హిమాలయాలకు వెళ్లిపోయేవాడినని చెప్పడం ఫ్యాన్స్ కి షాకిచ్చింది.

నిజానికి గురు తర్వాత వెంకటేష్ ఒక తరహా రిటైర్మెంట్ మూడ్ లో కనిపించిన మాట వాస్తవం. ఆ టైంలో హఠాత్తుగా కథలు వినడం తగ్గించారు. కొంచెం గ్యాప్ తీసుకుని తిరిగి లైన్ లోకి వచ్చేసి ఎఫ్2 లాంటి కామెడీ బ్లాక్ బస్టర్ తో అదరగొట్టారు. మళ్ళీ మనసు మార్చుకోవడానికి అసలు కారణం ఇప్పుడు బయట పడింది. చిరు వెంకీల మధ్య బాండింగ్ ఎలాంటిదో నిన్న ఇంకోసారి బహిర్గతమయ్యింది. ఇద్దరు పరస్పరం డైలాగులు ఎక్స్ చేంజ్ చేసుకోవడం, వెంకటేష్ గ్యాంగ్ లీడర్ లో రఫ్ఫాడిస్తా అంటూ, చిరు సింగల్ హ్యాండ్ గణేష్ అంటూ సందడి చేయడం పేలింది.

ప్రచారం జరిగినట్టు మహేష్ బాబు, నాగార్జున, బాలకృష్ణలు రాకపోవడం నిరాశపరిచినా నాని, శ్రీవిష్ణు, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ తదితరులు హాజరు కావడంతో నిండుతనం వచ్చింది. స్టేజి మీద దర్శకుడు అనిల్ రావిపూడి పాత పాటలకు డాన్స్ చేయడం కిక్ ఇచ్చింది. వెంకీ 75 ద్వారా ఫ్యాన్స్ కు అరుదైన కానుకైతే ఇచ్చారు. జనవరి 13 విడుదల కాబోతున్న సైంధ‌వ్‌ కు ప్రీ రిలీజ్ ఈవెంట్ తరహాలో దీన్ని చేయడం విశేషం. త్వరలోనే ఈటీవీ విన్ తో పాటు శాటిలైట్ ఛానల్ లోనూ ప్రసారం చేయబోతున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఈ వీకెండ్ లోనే స్ట్రీమింగ్ చేస్తారు.