గుంటూరు కారం ఆఖరి పాట కథేంటి

జనవరి 12 ఎంతో దూరంలో లేదు. ఇంకో ఇరవై నాలుగు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో టీమ్ ఉరుకులు పరుగులు పెడుతోంది. మూడు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. ఇంకొక్క సాంగ్ బ్యాలన్స్ ఉంది. ఇది పక్కా ఊర మాస్ బీట్. ఎవరైనా గెస్ట్ హీరోయిన్ ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ ఉంది కానీ అదెంత వరకు నిజమో షూటయ్యే దాకా చెప్పలేం. రాశిఖన్నా పేరైతే వినిపిస్తోంది. ఓ మే బేబీ ఫీడ్ బ్యాక్ విషయంలో మహేష్ చాలా కోపంగా ఉన్నాడని, అందుకే చివరి పాట అవుట్ ఫుట్ పట్ల సంతృప్తిగా లేనందుకు మళ్ళీ చేసుకు రమ్మని షూట్ ఆపారనే ప్రచారం ఫ్యాన్స్ లో కలకలం రేపింది.

నిర్మాత నాగవంశీ స్వయంగా దీని గురించి ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చారు. అవన్నీ పుకార్లేనని, ఇరవై ఒకటి నుంచి చిత్రీకరణ ఉంటుందని తేల్చి చెప్పేశారు. టీమ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవం. జరిగిపోయిన భాగానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ అవన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరుండి చూసుకోలేనంత టైట్ గా ఉంది పరిస్థితి. మరోవైపు రీ రికార్డింగ్ మీద భారీ అంచనాలు ఉండటంతో తమన్ మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్కోర్ ఇవ్వాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ కానుకగా ట్రైలర్ అన్నారు కానీ అదేమీ లేదట. జనవరి మొదటి వారంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే లాంచ్ ఉండొచ్చు.

ఇదంతా ఎలా ఉన్నా గుంటూరు కారం బజ్ కొచ్చిన ఇబ్బందేమీ లేదు. సర్కారు వారి పాట తర్వాత ఏడాదిన్నరకు పైగా గ్యాప్ వచ్చేసింది. దీంతో ఫ్యాన్స్ అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. పైగా అల వైకుంఠపురములో తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న మూవీ కావడంతో అంతకు మించి ఉంటుందనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. ఓ మై బాబీ పాట వ్యవహారం ఎలా ఉన్నా అసలైన కంటెంట్ చాలా బాగా వచ్చిందని, పోకిరి తర్వాత అంత మాస్ ఇందులోనే చూడొచ్చని యూనిట్ సభ్యులు తెగ ఊరిస్తున్నారు. ప్రమోషన్ పరంగా నా సామిరంగ ఒక అడుగు ముందే ఉండటంతో గుంటూరు కారం స్పీడ్ పెంచాల్సిందే.