మంచి టైం మిస్సవుతున్న మణిశర్మ

మెలోడీ బ్రహ్మగా పేరొందిన మణిశర్మ గురించి కొత్తగా సినీ ప్రియులకు చేయాల్సిన పరిచయం ఏమీ లేదు. ఇండస్ట్రీలో ఇప్పుడున్న సీనియర్ జూనియర్ హీరోలందరికీ ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన అరుదైన ట్రాక్ రికార్డు ఆయనకుంది. ఒక్కడు, ఇంద్ర, సమరసింహారెడ్డి, ఆది లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ల స్థాయిని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పదింతలు పెంచిన ఘనత మణిశర్మ స్వంతం. ఇప్పుడీయన ప్రస్తావన తెచ్చేందుకు కారణం ఉంది. టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల కొరత ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. అంచనాలు ఎక్కువైపోయి తమన్ లాంటి వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి పడుతోంది.

ఈ టైంలో మణిశర్మ మళ్ళీ పికప్ అయ్యుంటే బాగుండేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 2019లో ఇస్మార్ట్ శంకర్ తో కంబ్యాక్ ఇచ్చిన మెలోడీ బ్రహ్మ తర్వాత ఎందుకనో గొప్ప అవుట్ ఫుట్ ఇవ్వలేకపోతున్నారు. రెడ్, సీటిమార్, రిపబ్లిక్, శ్రీదేవి సోడా సెంటర్, శాకుంతలం, భళా తందనాన, బెదురులంక 2012, ఆచార్య ఇలా అవకాశాలు చాలానే వచ్చాయి కానీ గ్రేట్ అనిపించుకుని ఏళ్ళ తరబడి వినాలనిపించే పాటలు వీటిలో లేకపోయాయి. పూరి జగన్నాధ్ చేయించుకున్న రేంజ్ లో ఇంకెవరు మణిశర్మ నుంచి బెస్ట్ రాబట్టుకోలేకపోయారు. సినిమాలు ఫెయిల్యూర్ కావడమూ పరిగణించాలి.

ఒకవేళ పైన చెప్పినవి ఛార్ట్ బస్టర్ అయ్యుంటే స్టార్ హీరోలు తిరిగి మణిశర్మనే పిలిచేవాళ్ళు. ముఖ్యంగా మహేష్ బాబు లాంటి వాళ్లకుమణిశర్మ అవసరం చాలా ఉందనేది సగటు మూవీ లవర్స్ అభిప్రాయం. ఇప్పుడీయన చేతిలో డబుల్ ఇస్మార్ట్ ఉంది. మొదటి భాగం కన్నా భారీ స్కేల్, బడ్జెట్ తో పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్నారు. ముందు సంగీతం ఎవరికి ఇవ్వాలనే దాని మీద చాలా సమయం తీసుకుని చివరికి మణిశర్మనే తీసుకున్నారు. ఇటీవలే సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ పుష్ప, వాల్తేరు వీరయ్యతో తిరిగి సక్సెస్ ట్రాక్ లో పడ్డట్టు మెలోడీ బ్రహ్మకు అర్జెంటుగా ఒక బ్రేక్ దక్కాలి.