దిల్‍ రాజు జాక్‍పాట్‍తో టాలీవుడ్‍లో హడావుడి

కరోనా తగ్గే వరకు సినిమా షూటింగ్సే వద్దనుకున్న తెలుగు సినిమా వాళ్లు ఇప్పుడు వరుసగా చాలా సినిమాలను తిరిగి మొదలు పెట్టేసారు. ముఖ్యంగా నిర్మాణ దశ చివర్లో వున్న సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఓటిటిల నుంచి వస్తోన్న మెగా డీల్స్ సొంతం చేసుకోవడమేనని అర్థమవుతోంది. వి చిత్రానికి ముప్పయ్‍ కోట్లకు పైగా అమెజాన్‍ చెల్లించడంతో ఇంతకాలం ‘ఓటిటిల నుంచి ఎంత వస్తుందిలే’ అని లైట్‍ తీసుకున్న వారిని పరుగులు పెట్టిస్తోంది. హీరో రేంజ్‍, మార్కెట్‍ దృష్టిలో వుంచుకుని ఓటిటి సంస్థలు అమౌంట్‍ కోట్‍ చేస్తున్నాయి. థియేటర్ల నుంచి ఎంతయితే వస్తుందో అంత ఓటిటిలు ఇస్తామని ముందుకు రావడంతో నిర్మాతలు చలాకీగా పనులు మొదలు పెట్టేసారు.

కరోనా టైమ్‍లో షూటింగ్‍ వ్యయం మామూలుగా కంటే అధికమయినా కానీ ఆరు నెలలుగా ఆపుకుని కూర్చున్న సినిమాలను అమ్మేసే అవకాశాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు. విశేషం ఏమిటంటే ఇప్పుడు తమ సినిమాలు థియేటర్లలో విడుదల కాకపోయినా ఫర్వాలేదని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ విపత్తులో సినిమా రిలీజయ్యి, వసూళ్లు రాకపోతే బయ్యర్ల గోల ఎక్కువగా వుంటుంది. అదే ఓటిటిలు అయితే ఒకేసారి అమ్మేసుకుని హ్యాపీగా గుండెల మీద చెయ్యేసుకుని పడుకోవచ్చు.