ప్రేక్షకులను పిండం భయపెట్టిందా

మోస్ట్ స్కేరీ ఫిలిం ఎవర్ పేరుతో ప్రమోషన్ చేసుకున్న పిండం నిన్న థియేటర్లలో విడుదలైంది. మొత్తం పది సినిమాలు వచ్చినా అంతో ఇంతో అంచనాలు దీని మీదే ఉన్నాయి. ప్రత్యేకంగా హారర్ ప్రేమికులను లక్ష్యంగా పెట్టుకున్న మూవీ కావడంతో కాసింత డీసెంట్ ఓపెనింగ్స్ పిండంకు దక్కాయి. హీరో శ్రీరామ్, కన్నడ హీరోయిన్ ఖుషి రవి భార్యాభర్తలుగా నటించగా ఈశ్వరి రావు, అవసరాల శ్రీనివాస్ తో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద అంతంతమాత్రంగా పోటీ ఉన్న నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని పిండం వాడుకుందా అంటే పూర్తిగా లేదనే చెప్పాలి.

కథా నేపధ్యం 1990లో జరుగుతుంది. శుక్లాపేటలో ఉద్యోగం తెచ్చుకున్న ఆంథోనీ(శ్రీరామ్) తక్కువకు దొరికిందని ఓ పాత ఇంటిని కొనుగోలు చేరి భార్య మేరీ(ఖుషి రవి), తల్లి, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి అందులో చేరతాడు. అక్కడి నుంచి భయం కలిగించే విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. దీంతో మీడియేటర్ సలహాతో భూత వైద్యురాలు అన్నమ్మ(ఈశ్వరిరావు)ని తీసుకొస్తాడు. ఆమెకు ఆ ఇంట్లో ఉన్న ప్రమాదం అర్థమవుతుంది. అక్కడ ఆత్మలున్న సంగతి పసిగట్టి వాటి విరుగుడు కోసం పూనుకుంటుంది. ఇంతకీ ఆంథోనీ ఫ్యామిలీ ఈ దెయ్యాల ఉచ్చులో నుంచి ఎలా బయటపడిందనేది స్టోరీ.

పబ్లిసిటీలో గ్రాండ్ గా చెప్పుకున్నారు కానీ మరీ అమోఘం, ఒళ్ళు జలదరింపు అనే స్థాయిలో దర్శకుడు సాయికిరణ్ ధైడా పిండంని రూపొందించలేదు. కీలకమైన పాయింట్ ని వైవిధ్యంగా ఎంచుకున్నప్పటికీ ఒక దశ దాటాక రొటీన్ హారర్ ఎలిమెంట్స్ నిండిపోవడంతో అక్కడక్కడ భయం అనిపించే అంశాలు తప్ప మరీ ప్రత్యేకంగా నిలవలేదు. దానికి తోడు ఎక్కువ నిడివి, సుదీర్ఘమైన ప్రీ క్లైమాక్స్ లో భూతవైద్యాల ప్రహసనం బోర్ కొట్టించేస్తుంది. చైల్డ్ ఆర్టిస్టులతో సహా క్యాస్టింగ్ నటన బాగా కుదిరింది. హారర్ ని విపరీతంగా ఇష్టపడేవాళ్ళు ఓసారి ట్రై చేయొచ్చు కానీ ఎప్పుడూ చూడని అనుభూతి అయితే పిండం ఇవ్వలేకపోయింది.