డైరెక్టర్ ధనుష్ సూపర్ ఫాస్ట్

తమిళ స్టార్ హీరో ధనుష్ బహుముఖ ప్రజ్ఞ గురించి అందరికీ తెలిసిందే. అతను కేవలం నటుడు మాత్రమే కాదు. గాయకుడు, గేయ రచయిత, రచయిత దర్శకుడు కూడా. ఈ విభాగాలు అన్నిట్లో ఇప్పటికే గొప్ప ప్రతిభ చాటుకున్నాడు. దర్శకుడిగా తన డెబ్యూ మూవీ పవర్ పాండి విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తోపాటు మంచి వసూళ్లు కూడా సాధించి కమర్షియల్ హిట్ గా నిలిచింది.

దీని తర్వాత రుద్ర పేరుతో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలనుకున్నాడు ధనుష్. అందులో మన సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా ఒక కీలక పాత్ర చేయాల్సింది. కానీ బడ్జెట్ సమస్యలతో ఆ సినిమా మొదలవకుండానే ఆగిపోయింది. తర్వాత కొన్నేళ్లు డైరెక్షన్ గురించి ఆలోచించనేలేదు ధనుష్.

అయితే ఈ ఏడాది ఆరంభంలో దర్శకుడిగా తన రెండో చిత్రాన్ని ప్రకటించాడు ధనుష్. అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పెద్ద బడ్జెట్లోనే ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చింది. అయితే అనౌన్స్మెంట్ తర్వాత ఆరు నెలలు ఈ సినిమా వార్తల్లో లేదు. నటుడిగా తన చేతిలో ఉన్న వేరే సినిమాలు పూర్తి చేసి.. చడిచప్పుడు లేకుండా జూలై నెలాఖరులో ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాడు ధనుష్. ఆ తర్వాత సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ లేదు. ఇప్పుడు చూస్తే ఉన్నట్లుండి సినిమా షూట్ పూర్తయినట్లుగా తనే అప్డేట్ ఇచ్చాడు.

ఎస్.జె.సూర్య, నిత్యామీనన్, సందీప్ కిషన్.. ఇలా పెద్ద తారాగణమే ఉన్న సినిమా ఇది. ధనుష్ తనే లీడ్ రోల్ చేస్తూ ఇలాంటి పెద్ద సినిమాను ఐదు నెలల లోపు పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. దర్శకుడిగా అతనికున్న క్లారిటీకి ఇది నిదర్శనం. ఈ సంక్రాంతికి కెప్టెన్ మిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న ధనుష్.. వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. కెప్టెన్ మిల్లర్ హడావుడి ముగిశాక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఇతర విశేషాలు రివీల్ చేయబోతున్నారు. ధనుష్ కు నటుడిగా ఇది 50వ సినిమా కావడం విశేషం. మరి దర్శకుడిగా తన రెండో సినిమాతో ధనుష్ ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.