ట్రోలర్లకు మిడిల్ ఫింగర్ చూపించిన కరణ్

బాలీవుడ్లో ఎఫైర్లు, బ్రేకప్ లు సర్వసాధారణం. అక్కడ సెలబ్రిటీలు కూడా వీటి గురించి చాలా క్యాజువల్‌గా మాట్లాడేస్తుంటారు. ముఖ్యంగా కరణ్ జోహార్ హోస్ట్ చేసే ‘కాఫీ విత్ కరణ్’ షోలో చర్చలన్నీ వీటి గురించే ఉంటాయి. ఈ షో పాపులారిటీ కూడా ఇలాంటి టాపిక్స్ మీదే ఆధారపడి ఉంటుంది.

ఇటీవల ఇదే షోలో తన భర్త రణ్వీర్ సింగ్ పక్కనుండగా దీపికా పదుకొనే తన పాత రిలేషన్‌షిప్స్ గురించి చెప్పిన మాటలు పెద్ద దుమారమే రేపాయి. దీనివల్ల దీపికతో పాటు కరణ్ జోహార్ సైతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. కొంపలు కూల్చే షో అంటూ కాఫీ విత్ కరణ్ మీద విమర్శల వర్షం కురిసింది. అయితే ఆ వివాదం మీద దీపిక, రణ్వీర్, కరణ్ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

కాగా ఇప్పుడు కరణ్ జోహార్.. తన షోలో దీపిక-రణ్వీర్ ఎపిసోడ్ మీద విమర్శలు గుప్పించిన వారిపై తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఆ ఎపిసోడ్ ను ట్రోల్ చేసిన వారికి ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించాడు. తాజాగా సిద్ధార్థ రాయ్ కపూర్, అర్జున్ కపూర్ పాల్గొన్న ఎపిసోడ్లో కరణ్ మాట్లాడుతూ.. దీపిక-రణ్వీర్ ఎపిసోడ్ ను ది బెస్ట్ గా అభివర్ణించాడు. దీపిక-రణ్వీర్ ఆ ఎపిసోడ్లో చాలా నిజాయితీగా.. ఓపెన్ గా మాట్లాడారని.. వారితో సంభాషణ చక్కగా సాగిందని.. అలాంటి ఎపిసోడ్ మీద ఆ స్థాయిలో ట్రోలింగ్ జరగడం అనూహ్యమని కరణ్ అన్నాడు.

దీపికను విమర్శించిన వాళ్ళందరూ చూసుకోవాలని.. పని పాట లేని వాళ్లే ఇలా చేస్తారని పేర్కొంటూ ట్రోలర్లకు ఆవేశంగా మిడిల్ ఫింగర్ చూపించాడు కరణ్. మామూలుగా విమర్శలను చాలా తేలిగ్గా తీసుకునే కరణ్ ఈ స్థాయిలో స్పందించడం చర్చనీయాంశంగా మారింది.