పదో రోజు స్పెషల్ షోలు ఇదేం విచిత్రం

యానిమల్ సృష్టించిన భీభత్సానికి ట్రేడ్ సైతం నివ్వెరపోతోంది. రెండు వారాలు దాటకుండానే 660 కోట్ల గ్రాస్ వసూలు చేయడం చూసి ఎవరికీ నోటమాట రావడం లేదు. ఈ సునామి అంత సులభంగా నెమ్మదించేలా లేదు. అసలు ట్విస్టు వేరే ఉంది. మాములుగా రిలీజైన మొదటి మూడు రోజులు స్పెషల్ షోలు మాములే కానీ పదో రోజు అర్ధరాత్రిళ్ళు ప్రీమియర్లు వేయడం మాత్రం ఒక్క యానిమల్ కే జరిగింది. ఆదివారం కటిక చీకటి అర్ధరాత్రి 12 గంటలు మొదలుపెట్టి ఉదయం 4 దాకా ముంబై మల్టీప్లెక్సుల్లో షోలు వేయడం విచిత్రమైతే చాలా మటుకు హౌస్ ఫుల్స్ కావడం మరో షాక్.

ఒకరకంగా చెప్పాలంటే యానిమల్ కోసం నార్త్ ఆడియన్స్ ఏకంగా శివరాత్రి జాగారాలు చేస్తున్నారు. మూడున్నర గంటల సినిమా, పావు గంట ఇంటర్వెల్, రానుపోను గంట ప్రయాణం మొత్తం లెక్కేసుకుంటే అసలు ఇంటికెళ్ళాక కునుకు వేసేందుకు కూడా ఛాన్స్ ఉండదు. అయినా సరే ఆడియన్స్ లెక్క చేయడం లేదు. అలా అని టికెట్ రేట్లలో డిస్కౌంట్లు ఇవ్వడం లేదు. రెండు వందలతో మొదలుపెట్టి వెయ్యికి పైగానే ధరలు పెడుతున్నా ఆన్ లైన్లోనే ప్రేక్షకులు కొనేస్తున్నారు. ఇంత మేనియాని గత కొన్నేళ్లలో షారుఖ్, అమీర్, సల్మాన్ లాంటి బడా స్టార్లు చూడలేదన్నది వాస్తవం.

ఇది డిసెంబర్ మూడో వారం సలార్, డంకీ వచ్చే దాకా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రన్బీర్ కపూర్ కెరీర్ లోనే కాదు వరల్డ్ వైడ్ టాప్ 10 హయ్యెస్ట్ గ్రాసర్స్ లో చోటు సంపాదించుకున్న యానిమల్ వెయ్యి కోట్ల మార్క్ దాటడం లాంఛనమే. జవాన్ ని ఇప్పట్లో ఎవరూ క్రాస్ చేయరు అనుకుంటే రెండు నెలలు తిరక్కుండానే సందీప్ రెడ్డి వంగా దాటి చూపించేలా ఉన్నాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్క లీడ్ యాక్టర్ సోషల్ మీడియా అకౌంట్ల ఫాలోయర్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. రష్మిక మందన్న కన్నా త్రిప్తి డిమ్రి ఎక్కువ హైలైట్ కావడం చూశాంగా.