పుష్ప, యానిమల్ మీద ఎంపి విమర్శలు

మాములుగా రాజకీయ నాయకులు సినిమా ప్రపంచంతో పెద్దగా సంబంధం లేనట్టుగా ఉంటారు. ఏదైనా వివాదం వచ్చినపుడు తప్ప తల దూర్చడం లాంటివి ఉండవు. తాజాగా ఛత్తీస్ గడ్ కు చెందిన ఎంపీ రంజిత్ రంజన్ రాజ్య సభ్యలో పుష్ప, యానిమల్, కబీర్ సింగ్ గురించి లేవనెత్తిన అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. వీటిలో హీరోలను విపరీత ప్రవర్తనతో చూపించి, ఆడవాళ్ళ పట్ల అనైతిక ప్రవర్తనలు ప్రేరేపించడం వల్ల దాని ప్రభావం సమాజం మీద పడుతోందని, యువత ఆలోచనలు పెడదారి పట్టే ప్రమాదం ఉందని స్పీకర్ ని ఉద్దేశించి సభ్యులందరికీ తన ప్రశ్నలు వినిపించింది.

ఆవిడ చెప్పడమే కానీ నిజానికి ఇక్కడ కొన్ని అంశాలు గమనించుకోవాలి. సినిమాలు చూసి ప్రజానీకం ప్రభావితం చెందుతారా అంటే దీనికి సమాధానం సులభంగా చెప్పలేం. భారతీయుడు, ఠాగూర్, అపరిచితుడు చూసి ఎవరూ లంచాలు తీసుకోవడం, ఇవ్వడం మానలేదు. మహానటి చూసి తాగుడుకి దూరమైన వాళ్ళు ఎందరు. అలా అని మంచి తీసుకోనంత మాత్రాన చెడుని అంటించుకోరని కాదు. ఆ మధ్య ఢిల్లీలో ఒకడు భార్యని హత్య చేసి ఫ్రిడ్జ్ లో దాచి పెట్టాడు. ఎలా తట్టిందంటే ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ చూసి యధాతధంగా దాన్నే ఫాలో అయ్యాడట. విస్తుపోవడం పోలీసుల వంతైంది.

ట్రెండ్లు ఫ్యాషన్లు అధిక శాతం సినిమాల నుంచి వచ్చే మాట వాస్తవమే కానీ జరిగే ప్రతి తప్పుకు ఫిలిం మేకర్స్ నే బాద్యులు చేయడం సరికాదు. ఆ మాటకొస్తే మంచి చిత్రాలు తీసినప్పుడు ప్రోత్సహించే రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయని అడిగితే ఠక్కున సమాధానం రాదు. పుష్ప చూసి ఎవరూ స్మగ్లర్ కారు, యానిమల్ నుంచి బయటికి వచ్చాక ఇంటికెళ్లి ఎవడూ భార్య మీద చేయి చేసుకోడు. ఫాంటసీకి రియాలిటీకి తేడా పబ్లిక్ కి తెలుసు. ఎంపీ అడగటం బాగానే ఉంది కానీ అంతులేని చర్చకు దారి తీసే ఇలాంటి టాపిక్స్ మీద అంత సులభంగా కంక్లూజన్ కి రావడం అసాధ్యమనే చెప్పాలి.