స్పిరిట్ ప్రచారాలు మొత్తం గ్యాసే

ఇంకా స్క్రిప్టే మొదలుపెట్టలేదు. అప్పుడే ప్రభాస్ స్పిరిట్ మీద బోలెడు ప్రచారాలు జరిగిపోతున్నాయి. యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేస్తున్న ప్యాన్ వరల్డ్ మూవీ కావడంతో అంచనాలు ఆకాశాన్ని దాటిపోతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో మొదటిది త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా ఎంపిక కావడం. రెండోది ఏ సర్టిఫికెట్ ని మించిన వయొలెన్స్, అడల్ట్ డైలాగులు ఇందులో ఉంటాయని చెప్పుకోవడం. నిజానికి సందీప్ అనుకున్నది కేవలం లైన్ మాత్రమే. అది ప్రభాస్ కి బాగా నచ్చేసి చేసేద్దాం అన్నాడు.

ఫైనల్ వెర్షన్ రాశాక అప్పుడు జరిగేది అసలు చర్చ. ఎందుకంటే రన్బీర్ సింగ్ తరహాలో ప్రభాస్ ఆలోచనలు ఉండవు. తనకు ఇండియా వైడ్ మార్కెట్ ముఖ్యమే కానీ తెలుగు ఆడియన్స్ అభిరుచులను, పిల్లా పెద్దాలో తనకున్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేర్పులు సూచిస్తాడు. ప్రభాస్ రేంజ్ స్టార్ చెబితే సందీప్ కాదనడు. ఇక త్రిప్తి విషయానికి వస్తే ప్రస్తుతం తను ఎలాంటి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదు. సందీప్ కూడా మళ్ళీ రిపీట్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూడింటిలోనూ కీలక ఆర్టిస్టులను తిరిగి తీసుకోలేదు.

ఈ లెక్కన స్పిరిట్ కి సైతం కొత్తగా ఆలోచిస్తాడు. ఇప్పుడేదో యానిమల్ హవా నడుస్తోందని స్పిరిట్ గురించి కథలు అల్లుతున్నారు కానీ ఏవీ నిజం కాదు. ఈ సినిమాకు నిర్మాతలు కూడా టి సిరీసే. సందీప్ వంగా జనవరి రెండో వారం నుంచి ఫ్రీ అయ్యాక అప్పుడు అసలు రాతకోత మొదలుపెడతాడు. ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో స్పిరిట్ లో చూపించబోయే హింస మోతాదు ఎక్కువ ఉంటుందని అన్నాడు కానీ మరీ తీవ్రంగా అని నొక్కి చెప్పలేదు. సలార్ రిలీజ్, కల్కి విడుదల, మారుతీ సినిమా, సలార్ 2 షూటింగ్ అయ్యాక సందీప్ వంగాది సెట్స్ పైకి వెళ్తుంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.