లేడీ క్యాస్టింగ్ ఎంపికలో సందీప్ ముద్ర

బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన యానిమల్ లో రన్బీర్ కపూర్ పెర్ఫార్మన్స్ తర్వాత అందరూ ఎక్కువ మాట్లాడుకున్నది హీరోయిన్ల గురించే. రష్మిక మందన్న కన్నా ఎక్కువ త్రిప్తి డిమ్రి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి దాకా ఆరు లక్షల దాకా ఉన్న ఫాలోయర్లు ఒక్కసారిగా మిలియన్ దాటేసి ఆమె ఫోటోల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇది కనిపెట్టిన త్రిప్తి వెంటనే లేటెస్ట్ పిక్స్ తో ఇన్స్ టాని వేడెక్కిస్తోంది. నిజానికి ఆడిషన్లు జరిగిన టైంలో మొదటి ఛాయస్ తను కాదట. ముందు సారా అలీ ఖాన్ మీద టెస్ట్ షూట్ చేశారు. కానీ సందీప్ కి అమ్మాయిలో అప్పీల్ కనిపించలేదు.

దీంతో ఆమెను వద్దనుకున్నాక వెబ్ సిరీస్ లో పాపులరైన త్రిప్తి డిమ్రి సీన్ లోకి వచ్చింది. రష్మిక కన్నా ముందు సందీప్ పెట్టుకున్న ఆప్షన్ పరిణితి చోప్రా. బాగా అలోచించి డ్రాప్ అయ్యారు. ఈలోగా పుష్పలో నటనలో చూసి వెంటనే శ్రీవల్లిని కలవడం గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవడం జరిగిపోయాయి. ఒకవేళ ముందు అనుకున్నట్టు సారా, పరిణితిలు కనక ఈ పాత్రలు పోషించి ఉంటే ఖచ్చితంగా ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదన్నది వాస్తవం. దీన్ని బట్టే సందీప్ వంగా హీరోయిన్ సెలక్షన్ స్పెషలని చెప్పక తప్పుదు. బాలీవుడ్ విశ్లేషకులు సైతం తన తెలివైన ఎంపికను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

ఇక బాబీ డియోల్ ముగ్గురు భార్యలుగా నటించిన షబానా హరూన్, షఫీనా షా, మాన్సి తక్సక్ లు ట్విట్టర్ జనాలకు హాట్ టాపిక్ గా మారిపోయారు. వీళ్ళ ఫిల్మోగ్రపీని చెక్ చేసే పనిలో యానిమల్ ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు. అనిల్ కపూర్ భార్యగా నటించిన చారు శంకర్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చారు. రన్బీర్ కపూర్ అక్కా చెల్లిగా నటించిన ఇద్దరు మాత్రం అంత రైట్ ఛాయస్ అనిపించుకోలేకపోవడం ఒక్కటే చిన్న మైనస్ గా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఫిమేల్ లీడ్స్ సెలక్షన్ సందీప్ వంగా తన ముద్రని అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లో చూపించాడు. స్పిరిట్ లో ఏం చేస్తాడో చూడాలి.