పాపం వాళ్ళకు దిక్కెవరు?

సెప్టెంబర్‍లో కూడా సినిమా థియేటర్లు తెరవడానికి వీల్లేదని కేంద్రం ఆజ్ఞాపించడంతో థియేటర్లను కాపాడాలంటూ సోషల్‍ మీడియాలో హాష్‍ట్యాగ్స్ ట్రెండ్‍ చేస్తున్నారు. దేశంలో అన్నిటినీ తెరుచుకునేందుకు పర్మిషన్‍ ఇచ్చి సినిమా థియేటర్లను మాత్రం ఎందుకని మూసేసి వుంచారని సోషల్‍ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే థియేటర్లు తెరుచుకోకపోవడం పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందనలు లేవు.

థియేటర్లు తెరవాలంటూ సినిమా పెద్దలెవరూ డిమాండ్‍ చేయడం లేదు. రెండు నెలల క్రితం వరకు నిర్మాతలు సినిమా థియేటర్లు ఓపెన్‍ చేయాలనే డిమాండ్‍తో వున్నారు. కానీ ఇప్పుడు ఓటిటి నుంచి మంచి రాబడి వస్తుండడంతో నిర్మాతలు థియేట్రికల్‍ బిజినెస్‍ కోసం చూడడం లేదు. పూర్తయిన సినిమాలే కాదు, పూర్తి కాని సినిమాలకు కూడా ఓటిటితో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

అంటే రేపు థియేటర్లు ఓపెన్‍ అయినా కానీ ఇష్టం వున్న వాళ్లే థియేటర్లకు వెళతారు… లేని వాళ్లు ఇంట్లోనే చూసుకుంటారనే ధోరణిలో వున్నారు. సినిమా ఎగ్జిబిటర్లు, సినిమాల మీదే బ్రతికే క్యాంటీన్‍, సైకిల్‍ స్టాండ్‍ వాళ్లు, చివరకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు చాలా దారుణమయిన అవస్థలు పడుతున్నారు.

అయితే వారి తరఫున సినిమా పరిశ్రమ నుంచి పెద్ద గొంతుకలు వినిపిస్తే తప్ప ప్రభుత్వం చెవిన పడదు. కానీ పాపం వాళ్ల కష్టాలను ఇప్పుడయితే ఎవరూ గుర్తించడం లేదు. ఓ విధంగా ఓటిటిలు వచ్చి సినిమా బిజినెస్‍పై ఆధారపడ్డ వాళ్ల నోళ్లలో మట్టి కొట్టినట్టే.