వైజాగ్ లో అల్లు ఫ్యామిలీ, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 8 స్క్రీన్ల ఏఏఏ మల్టీప్లెక్స్ అఫీషియల్ గా లాంచయ్యింది. రాకా షూటింగ్ కోసం ముంబైలో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం వచ్చి ఈ వేడుకలో పాల్గొన్నాడు. ఇండస్ట్రీ నుంచి ప్రత్యేకంగా ఎవరినీ ఆహ్వానించలేదు కానీ బన్నీ వన్ మ్యాన్ షో లాగా ఓనర్ తోనే మొత్తం కార్యక్రమం జరిపించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో ఇనార్బిట్ మాల్ కిటకిటలాడింది.
ఒకప్పుడు స్టార్ హీరోలు తమ ఆదాయాన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్, ఆస్తులు, స్థలాలు పెంచుకోవడం మీద పెట్టేవారు. లేదంటే స్టూడియోలు కట్టి వాటి నిర్వహణను కుటుంబ సభ్యులకు ఇచ్చేవాళ్ళు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి చిరంజీవి నాగార్జున దాకా అందరిదీ ఇదే వరస. అయితే మహేష్ బాబు ఎప్పుడైతే గచ్చిబౌలి ఎఎంబికి శ్రీకారం చుట్టాడో అక్కడి నుంచి స్టార్లకు సరికొత్త ఆదాయ వనరు కనిపించింది. ఒక్కొకరుగా రంగంలోకి దిగి ఈ బిజినెస్ లో అడుగులు పెడుతున్నారు.
రవితేజ ఏఆర్టి జనంలోకి మెల్లగా దూసుకెళ్తోంది. విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో మొదలుపెట్టిన మల్టీప్లెక్స్ నుంచి మంచి రెవిన్యూ వస్తోంది. కోకాపేట్ చాలా దూరమే అయినా అల్లు సినిమాస్ ఆల్రెడీ టాప్ లిస్టులోకి చేరిపోయింది. అమీర్ పేట్ జనాలకు ఏఏఏ మంచి ఛాయస్ గా నిలుస్తోంది. త్వరలో ప్రారంభం కాబోతున్న హైదరాబాద్ ఐమాక్స్ లో మహేష్ బాబుతో పాటు వెంకటేష్, రానా లాంటి కొత్త భాగస్వాములు తోడవుతున్నారు. బెంగళూరు కపాలి ఏఎంబి మూవీ లవర్స్ కి డెస్టినేషన్ అవుతోంది.
భవిష్యత్తులో ఈ లిస్టు పెరగడమే కానీ తగ్గడం ఉండదు. రెస్టారెంట్ల కన్నా ఇలా తమ రంగానికి సంబంధించిన వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం స్టార్ హీరోలకు కేవలం బిజినెస్ కోణంలోనే కాకుండా వృత్తి పరంగానూ సంతృప్తినిస్తోంది. ఎలాగూ ప్రేక్షకుల సింగల్ స్క్రీన్ల వైపు అంతగా మొగ్గు చూపడం లేదు. ఫ్యూచర్ అంతా మల్టీప్లెక్సుల మీదే నడవబోతోంది. రామ్ చరణ్, తారక్ కూడా వీటి మీద ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరిగింది కానీ ఇప్పటికైతే వాళ్ళ దగ్గర సాలిడ్ ప్లాన్స్ లేవన్నది వాస్తవం.
Gulte Telugu Telugu Political and Movie News Updates