నాగార్జున సెంచరీ సినిమాకు దర్శకుడెవరు

సంక్రాంతి విడుదలని టార్గెట్ గా పెట్టుకుని నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న నా సామి రంగా నాగార్జునకు 99వ సినిమా. ప్రస్తుతం హైదరాబాద్ లోనే కీలక షెడ్యూల్స్ జరుపుతున్నారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామాలో మెయిన్ హీరోయిన్ గా ఆశికా రంగనాథ్ నటిస్తోంది. ఇవాళ తన పరిచయాన్ని చిన్న టీజర్ రూపంలో వదిలారు. దీని తర్వాత వందో మైలురాయి ఎవరితో చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తీస్తున్న పీరియాడిక్ పొలిటికల్ మూవీలో నాగ్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.

అలా అని ఇది క్యామియో కాదని ఇన్ సైడ్ టాక్. ఒకరకంగా మల్టీ స్టారరనే చెప్పాల్సి ఉంటుంది. రిలీజ్ ఎప్పుడో ఇంకా ఫిక్స్ కాలేదు కానీ వచ్చే ఏడాది రావడం పక్కా. మరోవైపు అనిల్ అనే తమిళ దర్శకుడికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వార్త ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా స్క్రిప్ట్ కూడా లాక్ చేశారట. లవ్ యాక్షన్ రొమాన్స్ టైటిల్ చక్కర్లు కొడుతోంది. ఇది ప్యాన్ ఇండియా మూవీ. జనవరి తర్వాత చిత్రీకరణ మొదలుపెడతారని చెన్నై టాక్. ఒకవేళ ఇది వేగంగా షూటింగ్ జరుపుకుంటే అప్పుడు శేఖర్ కమ్ములది నెమ్మదిగా వస్తుంది. సో 100 క్రెడిట్ ఎవరిదన్నది సస్పెన్స్.

నిజానికి గాడ్ ఫాదర్ టైంలో దర్శకుడు మోహన్ రాజా నాగ్ 100 కోసమే ఒక స్టోరీ చెప్పి సానుకూల స్పందన తెచ్చుకున్నాడు. అఖిల్ కూడా ఉండేలా ఒక లైన్ సెట్ అయ్యింది. ఈలోగా ఘోస్ట్ డిజాస్టర్ కావడం, గాడ్ ఫాదర్ యావరేజ్ దగ్గర ఆగిపోవడంతో నాగ్ మనసు మారింది. యాక్షన్ వదిలేసి పల్లెటూరి మాస్ కి షిఫ్ట్ అవ్వాలనుకున్న టైంలో మళయాలం మూవీ పోరంజు మరియం జోస్ రీమేక్ ప్రతిపాదన రావడం, అదిప్పుడు నా సామి రంగాగా మారడం వర్తమానం. మరి ఫైనల్ గా కింగ్ సెంచరీ సినిమా రిలీజ్ ప్రకారం కౌంట్ చేస్తారా లేక ఒప్పుకున్న వరసలో డిసైడ్ చేస్తారా చూడాలి.