హైదరాబాద్ యానిమల్ క్రేజ్ వేరే లెవెల్

దేశం మొత్తం మీద అత్యధిక మూవీ లవర్స్ ఉండే నగరం ఏదంటే తడుముకోకుండా హైదరాబాద్ పేరు చెప్పొచ్చు. ఇప్పుడే కాదు దశాబ్దాల నాటి నుంచి ఋజువవుతున్న నిజమిది. యానిమల్ అడ్వాన్స్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ స్వింగ్ లో ఉండగా ఒక్క భాగ్య నగరంలోనే మొదటి రోజు మూడు కోట్లకు పైగా గ్రాస్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సుల అమ్మకాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మంచి స్క్రీన్, సౌండ్ సిస్టమ్, వసతులు ఉన్న వాటిని ఆడియన్స్ వెతికి మరీ బుక్ చేసుకున్నారు. ఇప్పటిదాకా 60 శాతానికి పైగానే ఆక్యుపెన్సీ నమోదైపోయింది.

కరెంట్ బుకింగ్స్ తో మిగిలినవి సులభంగా ఫుల్ అయిపోతాయి. జవాన్, పఠాన్ స్థాయిలో మానియా మళ్ళీ యానిమల్ కే చూస్తున్నామని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. గత రెండు మూడు వారాలుగా థియేటర్లకు సరైన ఫీడింగ్ దక్కలేదు. మంగళవారంకు పాజిటివ్ టాక్ వచ్చినా అది పూర్తి స్థాయి బ్లాక్ బస్టర్ గా నిలవలేకపోయింది. కోటబొమ్మాళి పీఎస్ సైతం ఇదే సమస్యను ఎదుర్కొంది. దీంతో యానిమల్ మీద ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. పైగా ట్రైలర్, ప్రమోషన్లు, ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ వంగా ఇచ్చిన ఎలివేషన్లు మొదటి రోజే చూడాలనే రేంజ్ లో ఎగ్జైట్ మెంట్ ని కలిగించాయి.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం తీవ్రంగా ఉన్నప్పటికీ యానిమల్ మీద ఈ స్థాయి బజ్ ఉండటం సంచలనమే. ఎందుకంటే రెండు రోజుల సెలవు తర్వాత వర్కింగ్ డే రోజు రిలీజవుతున్న సినిమాకు మాములుగా బుకింగ్స్ నెమ్మదిగానే ఉంటాయి. దానికి భిన్నంగా యానిమల్ నమోదు చేస్తున్న వసూళ్లు చూస్తే షాక్ కొట్టడం ఖాయం. ఇక్కడే కాదు టయర్ 1 సిటీస్ అన్నింటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే ముంబై, కోల్కతాతో పోలిస్తే హైదరాబాద్ బుకింగ్స్ వేగంగా ఉన్న మాట వాస్తవం. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా వచ్చినా రన్బీర్ కపూర్ ఏకంగా షారుఖ్ ని దాటేసేలా ఉన్నాడు.