బాలీవుడ్ జనాలు అపార్థం చేసుకున్నారా

నిన్న యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి మల్లారెడ్డి అన్న మాటలు బాలీవుడ్ జనాల్లో ఓ మాదిరి కలకలం రేపాయి. ఇంకో అయిదేళ్లలో అందరూ హైదరాబాద్ వచ్చేయాలని,ముంబై పాతబడి బెంగళూరు ట్రాఫిక్ జామ్ ఎక్కువై టాలీవుడ్ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుందని, రన్బీర్ కపూర్ సైతం ఇక్కడ ఇల్లు తీసుకోక తప్పదనే రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చి గెస్టుల గురించి ఎలివేషన్లు ఇచ్చి స్టేజిని దడదడలాడించేశారు. ఏదో ఎన్నికల ఊపులో ఉన్న ఆయన అశ్వమేథ యాగం గురించి ప్రస్తావించడం ఆశ్చర్యపరిచింది. యానిమల్ అయిదు వందల కోట్లు వసూలు చేస్తుందంటూనే ప్రశంసలు, కౌంటర్లు అన్నీ కలిపేశారు.

ఇదంతా బాగానే ఉంది నార్త్ ప్రేక్షకులు మాత్రం హిందీ సినిమాని అవమానించినట్టు ఫీలవుతున్నారని సోషల్ మీడియా స్పందన చూస్తే తెలుస్తోంది. బాహుబలికి ముందున్న పరిస్థితులతో పోలిస్తే టాలీవుడ్ ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగిన మాట వాస్తవమే. ఆర్ఆర్ఆర్ ఏకంగా ఆస్కార్ తీసుకొచ్చింది. కెజిఎఫ్ ని ముంబై లాంటి నగరాల్లో ఎగబడి చూశారు. కానీ ఇలా ప్రతి మూవీని రిసీవ్ చేసుకోవడం లేదు. ప్యాన్ ఇండియా పేరుతో మన హీరోలు అక్కడికి వెళ్లి ఫోటో షూట్లు, ప్రెస్ మీట్లు ఎన్ని చేసినా ఏదో గ్రాండియర్ అయితే తప్ప దక్షిణాది సినిమాలను చూసేందుకు ఉత్తరాది ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదు.

ఇదంతా ప్రాక్టికల్ గా రెగ్యులర్ గా ఇండస్ట్రీ వ్యవహారాల మీద అవగాహన ఉన్న వాళ్లకు మాత్రమే తెలిసిన విషయాలు. మంత్రి మల్లారెడ్డి అంత లోతుగా ఆలోచించకుండా తన యూనివర్సిటీకి వచ్చి మరీ ఇందరు స్టార్లు సందడి చేసేసరికి ఏదేదో అనేశారు. దాంట్లో తప్పొప్పుల సంగతి పక్కనపెడితే స్పీచ్ కొంచెం మిస్ ఫైర్ అయిన మాట వాస్తవం. వీటి సంగతి ఏమో కానీ బిజినెస్ మెన్ చూసే తాను రాజకీయాల్లోకి వచ్చానని మల్లారెడ్డి అన్న మాటలు మహేష్ బాబు అభిమానులకు ఫుల్ గా ఎక్కేశాయి. ఆ వీడియోని పదే పదే షేర్ చేసుకుంటూ సూపర్ స్టార్ ప్రభావం ఈ రేంజ్ లో ఉంటుందని మురిసిపోతున్నారు.